ఏపీలో మరో రెండు పాజిటివ్‌ 

31 Mar, 2020 02:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో సోమవారం మరో రెండు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున నమోదైనట్టు స్పష్టమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఈ నెల 17న ఢిల్లీ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వచ్చారు. 19న రాజమండ్రికి బస్‌లో వెళ్లారు. ఈ నెల 29న కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి కోవిడ్‌ ఉందని తేలింది. అదే జిల్లాకు చెందిన మరో 49 ఏళ్ల వ్యక్తి ఈనెల 17న ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 18న సామర్లకోటకు వచ్చారు.

అక్కడ నుంచి కాకినాడలోని ఇంటికెళ్లారు. ఈ నెల 29న కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో కాకినాడ పెద్దాస్పత్రిలో చేరగా పరీక్షలు జరిపితే కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యక్తి ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తిరిగి తన స్నేహితుడితో కలిసి ఏపీకి వచ్చినట్టు గుర్తించారు. దీంతో కోవిడ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 23కు చేరింది. సోమవారం 68 నమూనాలను నిర్ధారణకు పంపించగా, 66 నమూనాలకు కోవిడ్‌ లేదని తేలింది. రెండు పాజిటివ్‌ వచ్చాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 29,405 మంది ఉన్నారని, 262 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. 

మరిన్ని వార్తలు