విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రిని ప్రైవేటు సంస్థకు అప్పగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో కేంద్రాస్పత్రిని ప్రైవేటు పరం చేసేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తియినట్టు సమాచారం. ఇప్పటికే ఆస్పత్రిలోని పలు విభాగాలను చంద్రబాబు సర్కార్ ప్రవేటు పరం చేసింది. వైద్య పరీక్షలు, రేడియాలజీ, ఓపీ ఆన్లైన్, శానిటేషన్, సెక్యూరిటీ విభాగాలను ప్రైవేటు పరం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆస్పత్రిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిని ప్రైవేటు పరం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు విజయవాడలో పూర్తిఅయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ అధికారులు ఎవరూ బయటకు చెప్పడం లేదు.
చిత్తూరులో ఇలానే...
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని అపోలో ఆస్పత్రికి అప్పగించేశారు. అదే తరహాలో మన కేంద్రాస్పత్రిని కూడా ప్రైవేటు పరం చేయనున్నారు. ఆస్పత్రిని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే అంతా వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. రెగ్యూలర్ ఉద్యోగాల భర్తీ ఉండదు. ఉద్యోగాల భర్తీని ప్రైవేటు సంస్థ నియమించుకుంటుంది. ఆస్పత్రిపై పెత్తనం మొత్తం ప్రైవేటు సంస్థకు వెళుతుంది. 1980లో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రూ. 300 కోట్లు విలువ చేసే ఆస్పత్రి ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళుతుంది. సదరు ప్రైవేటు సంస్థ వారు ఏడాదికి కోట్లాది రుపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు రోగులు నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. రెగ్యూలర్ ఉద్యోగులు సైతం వారు చెప్పినట్టే నడుచుకోవాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో లేని సేవలు అని చెప్పి డబ్బులు వసూలు చేయోచ్చు.
ఫైల్పై సంతకం అయిపోయిందట..
ఆస్పత్రిలో ఏ విభాగంలో చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది. కేంద్రాస్పత్రిని ప్రైవేటు పరం చేసే ఫైల్పై సంతకం అయిపోయిందనే వైద్య సిబ్బంది చర్చించుకుంటున్నారు.
ప్రస్తుత సేవల వివరాలు..
కేంద్రాస్పత్రిలో రోజుకు 1000 నుంచి 1200 మంది వరకు ఔట్ పేషేంట్స్ వస్తారు. అదేవిధంగా 200 పడకలు ఉన్నాయి. 200 మంది వరకు ఇన్పేషెంట్స్ చికిత్స పొందుతారు. ఆస్పత్రిలో గైనిక్, కంటి, ఎముకల, చర్మ, మెడికల్, జనరల్సర్జరీ, పిల్లల విభాగం, మానసిక విభాగం, దంత, ఈఎన్టీ విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్టీ సెంటర్, బ్లడ్బ్యాంక్, బ్లడ్కాంపొనెంట్ యూనిట్, సిటిస్కాన్, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్సరే, ఈసీజీ సౌకర్యాలు కూడా ఉన్నాయి.