అవినీతితో కను‘మరుగు’

17 Nov, 2018 08:24 IST|Sakshi
రాజవొమ్మంగి మండలం అప్పలరాజు పేటలో సెప్టిక్‌ ట్యాంకు నిర్మాణం పూర్తికాక ఉపయోగంలోకి రాని వ్యక్తిగత మరుగుదొడ్డిని స్టోర్‌రూమ్‌గా మార్చిన దృశ్యం

మరుగుదొడ్లలో అవినీతి కంపు

కాంట్రాక్టర్ల ముసుగులో సొమ్ము చేసుకున్న

టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో అధికారులు కుమ్మక్కు

అక్రమార్కుల ముందు బోల్తాపడుతున్న సాంకేతికత

మృతుల పేరున బిల్లులు డ్రా

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ఈ లెక్కలు చూస్తే స్వచ్ఛ భారత్‌ పక్కాగా అమలైందని అనుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అనేక అక్రమాలు జరిగాయి. అధికారులు రికార్డులపరంగా శతశాతం పూర్తి చేశామని చెబుతున్నా అనేక చోట్ల నిర్మాణాలు చేపట్టకుండా నిధులు మింగేశారు. జిల్లాలో రూ.100 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అందుకు.తగ్గట్టుగానే దాదాపు ప్రతి మండలంలో మరుగుదొడ్ల అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి.

రౌతులపూడి మండలంలో రూ. 1.50 కోట్లు మేరకు మరుగుదొడ్లు నిర్మాణాల పేరిట మింగేశారు. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నేత, ఓ మండల అధికారి కుమ్మక్కై దోచుకున్నారన్న విమర్శలున్నాయి. పరిమాణం ప్రకారం ఒక్కో మరుగుదొడ్డికి రూ. 12వేలు, రూ.15 వేలు, రూ.18 వేల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సొంతంగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని లబ్ధిదారులు భావించారు. ఇలాగైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తికావని అధికార పార్టీ నాయకులు నిధులు మింగేసేందుకు పథక రచన చేశారు. కాంట్రాక్టర్‌తో నిర్మిస్తామని, లేకుంటే మరుగుదొడ్డి మంజూరు కాదని పరోక్షంగా బెదిరించారు. దీంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో అంగీకరించారు. ఇలా పనులు మొదలు పెట్టి, సగం నిర్మాణం కూడా పూర్తి చేయకుండానే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు చాల్లేదని చెబుతూ ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. 3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేశారు. అయినప్పటికీ నిర్మాణా లు పూర్తి చేయకుండా సగంలో వదిలేశారు. ఇలా రాజవరం, గంగవరం, ఎ.మల్లవరం, పారుపాక, ఎస్‌.పైడిపాలలో పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిధులు కైంకర్యం చేశారు.

తొండంగి మండలంలో కూడా రూ.2 కోట్ల మేర  మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయి. నిర్మాణాలు చేపట్టకుండానే, లబ్ధిదారులకు తెలియకుండానే నిధులు డ్రా చేసేశారు. ఒక్క పైడికొండ పంచాయతీ పరిధిలో రూ.70 లక్షల వరకూ అవినీతి జరిగింది. గుత్తేదారు ఆన్‌లైన్‌లో నిర్మాణాలు పూర్తయినట్టు చూపించి నిధులు మింగేశారు. తొలుత పైడికొండ పంచాయతీ పరిధిలో ఆనూరులో అక్రమాలు వెలుగు చూడగా, పైడికొండ గ్రామస్తులు కూడా అనుమానంతో జాబితాలు పరిశీలించుకోగా లబ్ధిదారులకు తెలియకుండానే గుత్తేదారులు, అధికారులు కుమ్మక్కై దోచుకున్నట్టు తేలింది. దీనిపై విచారణ జరపగా అవినీతి నిజమని అధికారులు కూడా వెల్లడించారు. చనిపోయిన వారిపై కూడా మరుగుదొడ్లు నిర్మించినట్టు తేలింది. ఆనూరు, పైడికొండ గ్రామాల నుంచి అక్రమాలపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టగా అవినీతి తేట తెల్లమయ్యింది.  

పిఠాపురం మండలం    కోనపాపపేటకు చెందిన బెణుగు బంగారమ్మ పేరున 2013లో ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాగా దానిని ఆమె సొంతఖర్చుతో నిర్మించుకుంది. ఇంతలో (2014లో) బంగారమ్మ  చనిపోయింది. కానీ కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మాత్రం రాలేదు. ఆమె పేరున రెండు మరుగుదొడ్లు కట్టినట్లు, నిధులు డ్రా చేసినట్టు రికార్డుల్లో చూపించాయి. ఐడీ నంబరు  04047220500400094తో  13–6– 2013న ఒకటి పూర్తయినట్లు, రెండవది 040472205004000901 ఐడీ నంబరుతో 14–11–2013న  పూర్తయినట్లు  ఒక్కో దానికి రూ 12900 బిల్లులు మంజూరైనట్లు వాటిని డ్రా చేసినట్లు ఆన్‌లైన్‌లో ఉండడంతో వారి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తాము తీసుకోకుండా ఎవరు తీసుకున్నారని ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదని బంగారమ్మ కుమారుడు వాపోతున్నాడు.   

కోనపాపపేటకు చెందిన వికలాంగుడు తిత్తి సింహాద్రి, వాసుపల్లి పంపమ్మ తదితరుల ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మించకుండానే నిర్మించినట్లు ఆన్‌లైన్‌లో చూపించి, వారి తరపున వేరే వ్యక్తులు బిల్లులు డ్రా చేశారని ఫిర్యాదులొచ్చాయి.  

కాకినాడలోని దుమ్ములపేట మత్స్యకార ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి నిధులు కైంకర్యం చేశారు. లబ్ధిదారుల ఖాతాలో పడాల్సిన సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లించి దిగమింగేశారు. ఓ ఏఈ, స్థానిక అధికార పార్టీ నేతలు కుమ్మక్కు వ్యవహారాన్ని నడిపారు. విషయం బయటికి పొక్కడంతో పాటు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో నాటి కమిషనర్‌ సీరియస్‌గా తీసుకుని హెచ్చరించడంతో సదరు అధికారి, నేతలు సర్ధుకుని ఎవరికివ్వాల్సిన సొమ్మును వారికి ఇచ్చేసి అల్లరి కాకుండా చూసుకున్నారు.

జగ్గంపేట నియోజకవర్గంలో శుక్రవారం వ్యక్తిగత మరుగుదొడ్లపె ‘సాక్షి’ విజిట్‌ నిర్వహించింది. మిగిలిన నలుగురు మాత్రం నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడమే కాకుండా కనీసం రికవరీ చేయడానికి ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. అవినీతి వెలుగు చూడడంతో బాధితులు లబోదిబోమంటూ ఎంపీడీఓ  కార్యాలయానికి వచ్చి పలుమార్లు అందోళన చేయడంతో ఎట్టకేలకు విచారణ చేసేందుకు మూడు బృందాలను నియమించారు. మొక్కుబడిగా నాలుగు రోజులు విచారణ నిర్వహించి మధ్యలో విచారణ నిలిపివేశారు. ఈ మొత్తం అవినీతికి ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసిన అప్పటి కంప్యూటర్‌ ఆపరేటర్‌ కఠారి హరి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహకారంతో అధికార పార్టీ నాయకుల అండతో దళారులు భారీ అవినీతికి పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. జీపీఎస్‌ సిస్టమని, జియోట్యాగింగ్‌ అని, అవినీతే ఉండదన్నారు. తీరా చూస్తే అడుగడుగునా అక్రమాలేనని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో స్వచ్ఛభారత్‌ పేరుతో చిల్లంగి, కిర్లంపూడి, జగపతినగరం గ్రామాల పరిధిలో సుమారు 1957 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండానే నిధులు పక్కదారికి మళ్లాయి. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యడ్ల మురళీ కృష్ణ పేరు మీద ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా 15 మరుగుదొడ్లకు రూ. 1,35,000 ఒకసారి, రూ.90,000  జమయ్యాయి. ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని బూరుగుపూడి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాఠంశెట్టి వీరబాబు పేరుమీద పది వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.90,000, ఒకసారి, రూ.60,000 ఒకసారి మొత్తం కలిపి రూ.1,50,000 జమయ్యాయి. గ్రామానికి ఎటువంటి సంబంధం లేని, ఎక్కడో ఐ.ఐ.టి ఫ్యాకల్టీగా పనిచేస్తున్న గుడిమెల్ల శ్రీలక్ష్మి అనే మహిళ పేరుమీద 11 మరుగుదొడ్లకు వివిధ తేదీల్లో రూ.1,65,000 జమయ్యాయి.  కిర్లంపూడి గ్రామానికి చెందిన ఎ. దుర్గా పోలారావు పేరుమీద 30 మరుగుదొడ్లకు సంబంధించి 2017మార్చి 20న రూ. 12వేలు, మార్చి 27న రూ.42,000, జూలై 17న రూ. 1,80,000, మళ్లీ మార్చి 27న రూ.36,000, జూలై 10న రూ.24,000, జూలై 3న రూ.1,20,000, జూలై 10న రూ.36,000 జమయ్యాయి. అలాగే మాజీ సర్పంచి పి.నాగశివరామారావు పేరుమీద కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లకు ఎన్‌జీవోలు పేర్లమీద వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరయ్యాయి. ఇవే కాక వందలాది వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు పంచాయతీ ఖాతాకు జమయినప్పటికీ పలువురు లబ్ధిదారులకు బిల్లులు చేరలేదు.

అయినవిల్లి మండలంలో రూ.80 లక్షలపైనే అవకతవకలు జరిగాయి. వీటిపై పలువురు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని 21 గ్రామాలకుగాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 1090, స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా 2090 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి సొమ్ములు  నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. అయితే అలా కాకుండా పంచాయతీ ఖాతాల్లోను, కాంట్రాక్టర్‌ ఖాతాల్లో, ఏజెన్సీ ఖాతాల్లోను జమ చేశారు.  ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల ఖాతాల్లో కాకుండా తమకు ఇష్టం వచ్చిన ఖాతాల్లో మరుగుదొడ్ల సొమ్ములు జమ చేశారు.  ఇదీ పూర్తిగా అధికారుల నిర్వాకమేనని లబ్ధిదారులు ఆరోపించారు. మరుగుదొడ్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి తేవడంతో వారి ఒత్తిడి తట్టుకోలేక ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేసేందుకు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వారు చెప్పిన ఖాతాల్లో జమ చేశారు. ఇదే అదునుగా భావించిన క్షేత్ర స్థాయి సిబ్బంది తామేమీ తక్కువ కాదని తమ స్టైల్లో అవకతవకలకు పాల్పడ్డారు. మండలంలోని తొత్తరమూడిలో ఓ క్షేత్రస్థాయి సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో 15 మరుగుదొడ్లకు సంబంధించిన సొమ్ములు జమ చేశారు. కొండుకుదురు, శానపల్లిలంక, నేదునూరు, పొట్టిలంక, మడుపల్లి తదితర గ్రామాల్లోనూ క్షేత్ర స్థాయి సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో మరుగుదొడ్ల సొమ్ములను జమచేసినట్లు తెలుస్తోంది.

అక్రమాలపై విచారణ
జిల్లాలో ఐదు చోట్ల మరుగుదొడ్ల అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయి. విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. కుటుంబాలు పెరగడం కారణంగా కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. రూ.35 వేల వరకు మరుగుదొడ్లు అవసరమని గుర్తించాం.– సీహెచ్, అప్పారావు, ఇన్‌ఛార్జ్‌ ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

మరిన్ని వార్తలు