రైతన్నల ఖరీఫ్‌ నష్టం 10,000 కోట్లు + శరీర కష్టం

7 Nov, 2018 04:25 IST|Sakshi

ప్రధాన పంటలన్నీ ఖాళీ.. తల్లడిల్లుతున్న అన్నదాతలు

పంటను పశువులకు వదిలేసిన వేరుశనగ రైతులు

దిగుబడి లక్ష్యం 10 లక్షల టన్నులైతే లక్ష టన్నులూ గగనమే

అన్ని పంటల ఉత్పత్తి నష్టం గురించి తలుచుకుంటేనే వణుకు

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ రైతుకు దెబ్బమీద దెబ్బ. ఏ పంటా చేతికి వచ్చేలా లేదు. మొన్న వేరుశనగ.. నిన్న మొక్కజొన్న.. నేడు మినుము, మిర్చి.. రేపేమిటన్నది బెంగగా మారింది. ఎటు చూసినా అగమ్య గోచరమే. రాష్ట్ర స్థూల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెబుతున్న వ్యవసాయం ఈ ఏడాది అన్నదాతకు ఏమాత్రం కలిసివచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం, అనుబంధ రంగాలలో అభివృద్ధి సూచికలలో ఎంపిక చేసిన తొమ్మిది ప్రధాన పంటల్లో రెండింటిని ఈ రబీలో (శనగ, పొగాకు) సాగు చేయాల్సి ఉంటే మరొకటి (వరి) ప్రస్తుతం సాగులో ఉంది. మిగతా పంటలైన – మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ, పత్తి,మిర్చి దారుణంగా దెబ్బతిన్నాయి. చెరకు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఖరీఫ్‌ కకావికలం కావడంతో రైతులు పెట్టుబడుల రూపంలోనే దాదాపు రూ.10 వేల కోట్లు నష్టపోయినట్టు అనధికార అంచనా. విత్తనం వేసి చిత్తయిన వారు కొందరైతే వేసిన పంట చేతికి వస్తుందో రాదోనన్న బెంగతో ఉన్నవారు మరికొందరు. ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 39.53 లక్షల హెక్టార్లు కాగా, 35.47 లక్షల హెక్టార్లలో సాగయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. 

వేరుశనగ రైతులకు పెట్టుబడి నష్టం 3 వేల కోట్ల పైమాటే
రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌ ప్రధాన పంట వేరుశనగ. 9.23 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ 8.31 లక్షల హెక్టార్లుగా నిర్ణయిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.68 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. వాతావరణ పరిస్థితులు సరిగా లేక, సకాలంలో వర్షాలు పడక రైతులు ఆదిలోనే పంటను పశువుల మేపునకు వదిలేశారు. హెక్టార్‌కు 42 నుంచి 43 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి విత్తనాలు వేస్తే ఈ ఏడాది చేతికి వచ్చేది ఏమీ లేకుండా పోతోంది. ఈ లెక్కన పెట్టుబడి వ్యయమే 6.68 లక్షల హెక్టార్లకు రైతులు 3 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. ఈ ఏడాది దిగుబడి లక్ష్యం 10.2 లక్షల టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తే ఇప్పుడు కనీసం పది శాతం అంటే లక్ష టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా వేరుశనగ రైతులు మరికొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోనున్నారు. 

పత్తి రైతుకు రూ.2,100 కోట్ల నష్టం
రాష్ట్రంలో మొత్తం పత్తి సాగు విస్తీర్ణం 5.94 లక్షల హెక్టార్లు కాగా.. వర్షాభావం, తెగుళ్లతో దాదాపు సగం విస్తీర్ణంలో ఇప్పటికే దెబ్బతింది. అధికారిక లెక్కల ప్రకారం రైతులు ఒక్కో హెక్టార్‌లో పత్తి సాగుకు రూ.66 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తారు. అంటే రైతులు పెట్టుబడి వ్యయం కింద దాదాపు రూ.2,100 కోట్లు నష్టపోయారు. మిగిలిన ప్రాంతంలోనైనా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. మామూలుగా ఎకరానికి 20, 25 క్వింటాళ్లు రావాల్సిన పంట.. ఈ ఏడాది 5, 6 క్వింటాళ్లు కూడా దాటకపోవచ్చని రైతులు వాపోతున్నారు.

రూ.375 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే
రాష్ట్రంలో మొక్క జొన్న 1.25 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో లక్ష హెక్టార్లలో సాగవుతోంది. వర్షాభావంతో వచ్చిన కత్తెర తెగులుతో 75 శాతం పంట దెబ్బతింది. దీంతో రైతులు పంటను తొలగిస్తున్నారు. హెక్టార్‌ మొక్కజొన్న సాగుకు సగటున రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన రైతులు పెట్టుబడిగా పెట్టిన రూ.375 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కాగా మిగిలిన పంటైనా దక్కుతుందన్న ఆశలేదు. ప్రస్తుత లెక్క ప్రకారం పంట నష్టం వేయి కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇతర పంటల నష్టం రూ.225 కోట్లపైమాటే.. 
సజ్జ, జొన్న వంటి ఇతర ఆహార పంటలు సుమారు లక్షా 15 వేల హెక్టార్లలో సాగవుతుండగా జొన్న పంట 42 వేల హెక్టార్లలో సాగులో ఉన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా. ఈ పంటల సాగునకు హెక్టార్‌కు సగటున రూ.22 వేల వరకు ఖర్చవుతుంది. కత్తెర పురగు, ఇతర తెగుళ్ల ప్రభావంతో జొన్న తీవ్రంగా దెబ్బతింది. ఒక్క జొన్నపైనే పెట్టిన పెట్టుబడులు సుమారు రూ.93 కోట్లు. సజ్జ, రాగి, ఇతర చిరుధాన్యాలను కూడా కలుపుకుంటే ఈ నష్టం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి లేదు. కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రోత్సహించినా గత అనుభవాలతో రైతులు ఆసక్తి చూపకపోవడంతో 3.19 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన ఈ పంటలు 2.85 లక్షల హెక్టార్లకు పడిపోయాయి.

కంది హెక్టార్‌ సాగునకు రూ.29 వేలు, మినుము, పెసరకు హెక్టార్‌కు రూ.25 వేల వరకు ఖర్చవుతుంది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో ఇప్పటికే మినుము 20 వేల హెక్టార్లలో, పెసర పది వేల హెక్టార్లలో దెబ్బతింది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఈ పంటల్ని పీకేశారు. ఫలితంగా రైతులు పెట్టుబడి వ్యయం కింద రూ.75 కోట్లు, కొన్ని ప్రాంతాలలో సాగును మధ్యలోనే వదిలి వేయడంతో కంది రైతులు రూ.55 కోట్ల వరకు నష్టపోయినట్టు రైతు సంఘాలు పేర్కొన్నాయి. మిరప పంట 1.30 లక్షల హెక్టార్లలో సాగవ్వగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బొబ్బ తెగులు (జెమినీ వైరస్‌) సోకి పంటను ఊడ్చేస్తోంది. ఈ వైరస్‌తో రైతులు దాదాపు రూ.2 వేల కోట్ల పెట్టుబడులను నష్టపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు అక్కడక్కడా నిలిచిన పంట సైతం సరైన దిగుబడులు ఇచ్చే పరిస్థితి లేదు.  

చెరకు పరిస్థితి ఏమవుతుందో..
రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం 1.20 లక్షల హెక్టార్లుగా ఉన్నప్పటికీ లక్ష హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. నీటి వసతి ఉన్నప్పటికీ వర్షపాతంలో సమతూకం దెబ్బతిని పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పంట పూర్తిగా దెబ్బతినకపోయినా దిగుబడి, పంచదార రికవరీ శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. హెక్టార్‌కు 52 వేల రూపాయలు వ్యయం చేసినా, క్వింటాల్‌కు ప్రస్తుతం ఉన్న ధర రూ.275 మాత్రమే. అయితే పది శాతం పంచదార రికవరీ ఉండాలి. అది అరపాయింట్‌ తగ్గినా క్వింటాల్‌ రేటు రూ.261కి పడిపోతుంది. ఇదే జరిగితే రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. 

వరి రైతులకు రూ.1,480 కోట్ల నష్టం
అధికారిక లెక్కల ప్రకారం 15.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో కాస్త కుడి ఎడంగా సగం. ఇప్పటికే తిత్లీ తుపానుతో 1.50 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. నీటి వసతి లేక రాయలసీమ ప్రాంతంలో 50 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. అంటే 2 లక్షల హెక్టార్లలో పంట పోయినట్టే. హెక్టార్‌ వరి సాగునకు సుమారు రూ.74 వేల వరకు ఖర్చవుతుంది. ఫలితంగా రైతులు పెట్టుబడుల రూపేణా రూ.1,480 కోట్లు నష్టపోయినట్టు అంచనా.

ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి డెల్టాలోని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోపక్క కత్తెర తెగులు, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో రానున్న వర్షాలు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి, టమాటా రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు పది వేల కోట్ల రూపాయల వరకు రైతులు పెట్టుబడుల రూపంలోనే నష్టపోయారు. ఇక ఉత్పత్తి నష్టాన్ని మాటల్లో వర్ణించనలవి కాకుండా ఉంటుందని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు