ఇదేంది చైర్మన్‌ గారూ..!

5 Mar, 2019 19:22 IST|Sakshi
కౌన్సిల్‌ సమావేశం భవనం

వారం క్రితం రెండు నెలలపాటు కౌన్సిలర్‌ సస్పెన్షన్‌ అంటూ ప్రకటన

వెంటనే సస్పెన్షన్‌ రద్దుకు మొదటి అంశంగా అజెండాలోకి 

రూ.కోటికి పైగా  పనులకు ర్యాటిఫికేషన్‌ 

నేడు కౌన్సిల్‌ సమావేశం జరిగేనా?

సాక్షి, ప్రొద్దుటూరు టౌన్‌(వైఎస్సార్‌) :  ఐదు రోజుల క్రితం టీడీపీ 30వ వార్డు కౌన్సిలర్‌ సీతారామిరెడ్డిని ఫిబ్రవరి, మార్చి నెలల కౌన్సిల్‌ సమావేశాలకు రాకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28వ తేదీన కౌన్సిల్‌ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌కు దిక్కుతోచలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ కౌన్సిల్‌ సమావేశమే చివరిదిగా చెప్పుకుంటున్నారు. దీంతో కోరం లేక వాయిదా పడిన సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అత్యవసర కౌన్సిల్‌ సమావేశంగా ఏర్పాటు చేసినట్లు అజెండా రూపొందించి సోమవారం పంపిణీ చేశారు.

 
సస్పెండ్‌ రద్దు మొదటి అంశంగా...
అయితే ఈ అజెండాలో మొదటి అంశంగా సస్పెం డ్‌ అయిన టీడీపీ కౌన్సిలర్‌ జి.సీతారామిరెడ్డిని సస్పెండ్‌ నుంచి తొలగించేందుకు కౌన్సిల్‌ ముం దుంచారు. జనవరి 31న జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్‌ ప్రవర్తనకు చైర్మన్‌ మున్సి పల్‌ యాక్ట్, 1965 సెక్షన్‌ 51–5 ప్రకారం రెండు నెలలు సస్పెండ్‌ చేస్తూ ఫిబ్రవరి 27న నోటీసులు జారీ చేశారు. అయితే కౌన్సిలర్‌ 28న జరిగే కౌన్సిల్‌ స మావేశంలో సభ్యుల నిర్ణయానికి ఉంచాలని కోరా రు. కానీ ఎలాగైనా సీతారామిరెడ్డిని కౌన్సిల్‌ సమావేశానికి రాకుండా చేయాలని అజెండాలో ఈ అం శాన్ని చేర్చలేదు. కౌన్సిల్‌ సమావేశానికి ఎవ్వరూ రాక వాయిదా పడటంతో చైర్మన్‌ మార్చి నెల సమావేశం మొదటి అంశంగా చేర్చాలని చెప్పారు.

 
కౌన్సిల్‌ ఆమోదం లేకుండా సస్పెండ్‌ చేయడమేంటి సారూ..
కౌన్సిల్‌ సభ్యున్ని రెండు, మూడు నెలలు సస్పెండ్‌ చేయాలంటే సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన మరుసటి సమావేశంలో కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవాలని చట్టం చెబుతోంది. అయితే అదేదీ తమకు వర్తించదన్నట్లు, రెండు నెలలు సస్పెండ్‌ చేసిన చైర్మన్‌ వారం రోజులకే కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి అజెండాలోకి తీసుకురావడంపై తోటి కౌన్సిలర్లు నవ్వుకుంటున్నారు. తప్పుడు విధానాల్లో సస్పెండ్‌ చేసిన చైర్మన్, కమిషనర్లపై కోర్టులో పరువునష్టం దావా వేస్తామని కౌన్సిలర్‌ సీతారామిరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారని కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరైన కౌన్సిలర్లు అంటున్నారు.

 
ముక్తియార్‌ మాటపై నిలబడతారా...
టీడీపీ కౌన్సిలర్‌ సీతారామిరెడ్డిని సస్పెండ్‌ చేసిన సందర్భంలో కౌన్సిలర్‌ ముక్తియార్‌ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు.  ఇక తాము ఏ కౌన్సిల్‌ సమావేశాలకు వెళ్లమని, అన్నీ రిక్విజేషన్‌ సమావేశాలే నిర్వహిస్తామని చెప్పారు. ఇదే విధంగా మంగళవారం జరిగే సమావేశానికి ఎంపీ రమేశ్‌ వర్గం టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా మాట నిలబెట్టుకుంటారా, లేక అంతా ఉత్తుత్తి ప్రకటనలేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
 

మెజారిటీ లేకుండానే ర్యాటిఫై...
చైర్మన్‌ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని కొన్ని అంశాలను ర్యాటిఫై చేయాలని అనుకుంటే మెజారిటీ కౌన్సిల్‌ సభ్యులు తన వర్గంలో ఉండాలి. అప్పుడు ఆ అంశం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పోతుంది. అయితే ఈ చైర్మన్‌ వర్గంలో 9 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ రమేశ్‌ వర్గంలో 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్‌ రెండో అంశంలోని రూ.39.88 లక్షల పనికి,  3వ అంశంలోని రూ.39 లక్షల పనికి, 6వ అంశంలోని రూ.39 లక్షల పనికి దాదాపు రూ.కోటికిపైగా పనులకు ర్యాటిఫై చేశారు. మరి కౌన్సిల్‌ సభ్యులు ఈ అంశాలను రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో కోరితే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. చైర్మన్‌ చర్యలపై భగ్గుమంటున్న టీడీపీ కౌన్సిలర్లు ఈ అంశాలను ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు