మరణంలోనూ జంటగానే..!

17 Jun, 2014 02:56 IST|Sakshi

హిరమండలం : అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి.. ఇంతకాలం కలిసి జీవించిన ఆ వృద్ధ దంపతులను మృత్యువు సైతం విడదీయలేకపోయింది. చివరికి ఇద్దరినీ ఒకేసారి తీసుకుపోయింది. వడదెబ్బ ఆ జంటను ఉమ్మడిగా కాటేసింది. తీవ్రంగా వీస్తున్న వడగాడ్పుల ధాటికి ఆ దంపతులిద్దరూ ఒకేసారి కుప్పకూలి విగతజీవులయ్యారు. హిరమండలంలో జరిగిన ఈ సంఘటన ఆ కుటుం బంతోపాటు స్థానికులను కలచివేసింది. హిరమండలం మండలం మేజర్ పంచాయతీలోని గాంధీనగర్ వీధికి చెందిన రాడ అప్పయ్య (65) వంశధార ప్రాజెక్టులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆయన భార్య గరికమ్మ (60) గృహిణి. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఆర్టీసీలో ఆయన ఉద్యోగి.
 
 గత వారం రోజులుగా జిల్లాను అతలాకుతలం చేస్తున్న వడగాడ్పుల తీవ్రత సోమవారం కూడా కొనసాగింది. వడగాడ్పుల దాటికి తట్టుకోలేకపోయిన అప్పయ్య సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హఠాత్తుగా మృతి చెందారు. మరోవైపు  అప్పటికే వడగాడ్పుల ప్రభావంతో నీరసించిపోయిన గరికమ్మ భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురై గంట వ్యవధిలోనే తను కూడా మరణించింది. తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు మృతి చెందడాన్ని తట్టుకోలేక వారి  కుమారుడు కోటి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ భోరున విలపించారు.  మధ్యాహ్నం వరకు అందరినీ పలకరిస్తూ గడిపిన దంపతులు సాయంత్రానికి మరణించడాన్ని తలచుకొని స్థానికులు సైతం కంటతడి పెట్టారు.
 

మరిన్ని వార్తలు