మార్కాపురం (ప్రకాశం) : మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్తకు యావజ్జీవ ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముమ్మడివరం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్, సువార్త(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు.
ఈ క్రమంలో మద్యానికి బానిసైన ఇజ్రాయిల్ 2011 నవంబర్ 16న పూటుగా తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి విపరీతంగా కొట్టాడు. అతని నుంచి విడిపించుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో.. గొంతు నులిమి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా పూర్తి విచారణ అనంతరం నేరం నిరూపించబడటంతో సోమవారం జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.