‘వారి నమూనాలను ల్యాబ్‌కు పంపించాం’

21 Mar, 2020 15:03 IST|Sakshi

ప్రకాశం జిల్లాలో మంత్రి ఆళ్ల నాని పర్యటన

సాక్షి, ప్రకాశం: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కోవిడ్‌-19 పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ప్రజల సహకారంతో కరోనాను పారదోలుదామని పేర్కొన్నారు. మంత్రి ఆళ్ల నాని ప్రకాశం జిల్లాలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ, నివారణ చర్యలపై సమీక్ష చేశామని తెలిపారు. ఒంగోలులో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. (సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: పేర్ని నాని)

అతనితో సంబంధం ఉన్న అందరినీ గుర్తించామన్నారు. వాళ్లని కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబం సభ్యుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు రద్దీ మాల్స్, దేవాలయాలు, పాఠశాలలు, సినిమా హాళ్లు మూసివేశామన్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనాను సంకల్పం, జాగ్రత్తలతో కచ్చితంగా పారదోలుదామని అన్నారు. మాస్కులు వాడటమే కాదు. వాటిని సరిగా డిస్పోజ్ చేయకపోతే కొత్త సమస్యలు వస్తాయని మంత్రి వెల్లడించారు. ‘ప్రకాశం జిల్లా వైద్యుల పరిశీలనలో 18 కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో 28 రోజులు దాటినవి 10 కేసులు.  రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేసులు వైద్యుల పరిశీలనలో ఉన్నాయి. అందులో 250 కేసులు 28 రోజులు దాటినవి. శాంపిళ్లు పంపినవి 130 కేసులు, ఇందులో 3 కేసులు పాజిటివ్ వచ్చాయి’ అని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు