అనంతపురంలో సీపీఐ ఆందోళన ఉద్రిక్తం

11 Mar, 2015 14:12 IST|Sakshi


అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో అనంతపురం పట్టణంలో బుధవారం సీపీఐ తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్‌తో పాటు, ఏఐఎస్‌ఎఫ్, ఏవైఎఫ్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో కార్యకర్తలు పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్, తపాల కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రామకృష్ణ, జగదీష్‌తో పాటు ముఖ్య నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

మరిన్ని వార్తలు