‘భారీ బహిరంగ సభతో ప్రత్తిపాటికి చెక్‌’

10 Jun, 2017 19:53 IST|Sakshi
‘భారీ బహిరంగ సభతో ప్రత్తిపాటికి చెక్‌’

చిలకలూరిపేట(గుంటూరు): అధికార టీడీపీకి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. టీడీపీ వర్గీయులు గ్రామంలోని దళితులు, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న 156 ఎకరాల పట్టా భూమిలో నీరు-చెట్టు పథకం ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన సభలో మధు మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నీరు-చెట్టు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంలో వందలాది ఎకరాల దళితుల, బలహీనవర్గాల భూములను టీడీపీ నాయకులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. మరోవైపు మంత్రి భార్య ఈ దోపిడికి కీలకంగా నిలుస్తున్నారని, ఆమె సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మంత్రి ప్రత్తిపాటి ఆగడాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు