పోలవరంలో పగుళ్ల కలకలం

24 Feb, 2019 10:30 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఏర్పడిన పగుళ్లు

పశ్చిమగోదావరి జిల్లా: పోలవరం ప్రాజెక్టు సమీపంలో మరోసారి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు స్పిల్‌వే రెస్టారెంట్‌ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో దూర ప్రాంతాలను నుంచి పోలవరాన్ని సందర్శించేందుకు వచ్చిన వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో కూడా పోలవరం స్లూయిస్‌కు అతిసమీపంలో ప్రాజెక్టు వద్ద భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్లు ఏర్పడినపుడు అక్కడే ఉన్న సందర్శకులు పరుగులు పెట్టినట్లు తెలిసింది. పగుళ్లు ఏర్పడటానికి భౌగోళిక పరిస్థితులు కారణమై ఉండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు.

ప్రాజెక్టు లోపల తవ్విన మట్టిని బయటకు తీసుకువచ్చి ఒక చోట డంపింగ్‌ చేయడం, దానిపైనే నిర్మాణాలు చేపట్టడం, కాలక్రమేణా భూమిలో మార్పులు సంభవించడం, ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో పేలుళ్లు జరిపినపుడు వదులుగా ఉన్న భూమి పగుళ్లు ఏర్పడటానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఇలానే దాదాపు ఒకటిన్న కిలోమీటర్ల తారు రహదారి మొత్తం తవ్వేసినట్లు పగుళ్లు ఏర్పడినపుడు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

సుమారు రూ.100 కోట్లు వెచ్చించి సందర్శకుల పేరుతో టీడీపీ కార్యకర్తలను బస్సుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తెప్పించిన ప్రభుత్వం,  ఇలాంటి సంఘటనలు జరిగినపుడు తీసుకోవాల్సిన చర్యలపై ఖర్చు చేస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు