జార్ఖండ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

20 Jun, 2017 01:44 IST|Sakshi
జార్ఖండ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

మళ్లీ కలుస్తానో కలవనో అంటూ స్నేహితులకు మెసేజ్‌

ధర్మవరం అర్బన్‌ : జార్ఖండ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సంకు గురుప్రసాద్‌ (26) ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను వస్తానో రానో... మిమ్మల్ని మళ్లీ కలుస్తానో కలవనో.. ఐ మిస్‌ యూ.. ఫ్రెండ్స్‌’ అంటూ చనిపోవడానికి ముందు స్నేహితుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌ పెట్టాడు. ధర్మవరం పట్టణంలోని లోనికోటకు చెందిన గురుప్రసాద్‌ ఏడేళ్ల క్రితం సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా  చేరాడు.  20 రోజుల క్రితం సెలవుపై ధర్మవరం వచ్చిన గురుప్రసాద్‌.. తాను ఉద్యోగం చేయలేక పోతున్నానని చెప్పాడు.

కానీ తల్లిదండ్రులు నచ్చజెప్పి వారం క్రితం  జార్ఖండ్‌కు పంపారు. మనస్తాపంతో ఉన్న గురుప్రసాద్‌ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తన గదిలో ఏకే 47తో గడ్డం కిందిభాగంలో కాల్చుకున్నాడు. బుల్లెట్లు తలపై నుంచి బయటకు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  జవాన్‌ ఆత్మహత్య ఘటనతో ధర్మవరంలోని అతని ఇంట్లో విషాదం అలుముకుంది. జార్ఖండ్‌ నుంచి జవాన్‌ మృతదేహం మంగళవారం తెల్లవారుజామున ధర్మవరం రానున్నట్లు మృతుని బంధువులు తెలిపారు.

మరిన్ని వార్తలు