ఇసుక అక్రమాల అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు

20 Nov, 2019 05:28 IST|Sakshi

నిఘా కోసం సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల ఏర్పాటు

అధికారులకు సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల ఏర్పాటుపై సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, పోలీస్‌ తదితర శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఎంపిక చేసిన ముఖ్య ప్రాంతాల్లో చెక్‌ పోస్టుల వద్ద వాహనాలను నిరంతరం తనిఖీలు చేయడంతో పాటు సీసీ  కెమెరాలతో నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక రాష్ట్రందాటి వెళ్లకుండా చర్యలు తీసుకోవా లన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్య దర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సురేంద్రబాబు, గనులశాఖ కార్యదర్శి రాంగోపాల్, పంచాయతీరాజ్‌  కమిషనర్‌ గిరిజా శంకర్‌ పాల్గొన్నారు.

సచివాలయాల్లో ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయండి
గ్రామ, వార్డు సచివాలయాల్లో క్రీడా కోటా, ఇతర కేటగిరీల్లో భర్తీ కావాల్సిన పలు ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ నీలం సాహ్ని అధికారు లను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియపై ఆమె సమీక్షించారు. 

మరిన్ని వార్తలు