మెరుగైన వైద్యంతోనే కరోనాను జయించాం
డిశ్చార్జ్ అయిన పాజిటివ్ బాధితుల ఆనందం
తిరుపతి తుడా : ‘కరోనా వైద్య పరీక్షలకు భయపడాల్సిన పనిలేదు.. క్వారంటైన్కు వెళ్లాలంటే మొదట్లో మేమూ భయ పడ్డాం.. తిరుపతిలోని పాత మెటరి్నటీ ఆస్పత్రి కరోనా వార్డులో వసతులు, వైద్యుల పర్యవేక్షణ బాగున్నాయి. అందుకే కరోనా అనుమానితులు నిర్భయంగా ముందుకు రావాలి’ అని పాజిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన ముగ్గురు ప్రజలను కోరారు. మెటరి్నటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పలమనేరుకు చెందిన ఇద్దరు, ఏర్పేడుకు చెందిన మరొకరు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. వీరికి రెండు పర్యాయాలు నెగిటివ్ రావడంతో రుయా వైద్యాధికారులు డిశ్చార్జ్ చేసి, హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
డిశ్చార్జ్ పత్రాలను నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, ఆర్ఎంఓ హరికృష్ణ వారికి అందజేశారు. ఆ ముగ్గురు మీడియాతో మాట్లాడుతూ వైద్యుల చొరవతో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అధికారులకు సహకరించడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు కుటుంబ సభ్యులను కాపాడుకోవచ్చునని వివరించారు. ఐసోలేషన్లో మెరుగైన వసతులు కల్పించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.