కరెంటు కష్టాలు తీరాలంటే.. సౌర విద్యుత్ వైపు మళ్లాల్సిందే..

25 May, 2014 02:04 IST|Sakshi
కరెంటు కష్టాలు తీరాలంటే.. సౌర విద్యుత్ వైపు మళ్లాల్సిందే..

చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త గా ఏర్పడుతున్న సీమాంధ్రలో విద్యుత్ అవసరాలు తీరాలంటే సౌరవిద్యుత్ వైపు మళ్లాల్సిందే. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ(నెడ్‌క్యాప్), మినీస్ట్రీ ఆఫ్ న్యూఅండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, భారత ప్రభుత్వ సహకారంతో పట్టణ ప్రాంతాల్లోని సంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులకు ఉపయోగపడేలా పథకాన్ని రూపొందించింది.

వీటికి ప్రభుత్వం రాయితీతో సోలార్ విద్యుత్ తయారు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇలా చిన్న సోలార్ విద్యుత్ యూనిట్ల నుంచి తయారైన విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు అనుసంధానించి నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా పథకాన్ని రూపొందిం చింది. దీనికి సంబంధించి నెట్ మీట రింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రభుత్వానికే విద్యుత్ సరఫరా
వివిధ గృహాలు, ఆస్పత్రులు, సంస్థలు ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానల్స్(సౌర పలకలు) యూనిట్ల ద్వారా ఉత్ప త్తి అయ్యే విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ ఉంచకుండా ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ లైన్లకు వెళ్తుంది. అక్కడి నుంచి తిరిగి వినియోగదారుడికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ మధ్యలో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేశారు, ఎంత వాడుకున్నారు, విద్యుత్ మిగులు ఎంత అనే వివరాలను యూనిట్లలో లెక్క వేసేందుకు ఒక మీట రు ఉంటుంది.

ఈ పద్ధతినే నెట్ మీట రింగ్ అంటారు. వినియోగదారుడు వాడుకున్న విద్యుత్‌ను యూనిట్లలో లెక్కించి మిగులు విద్యుత్ ఉంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వినియోగదారుడికి డబ్బులు చెల్లిస్తారు. ఇలా సోలార్ యూనిట్ల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఒకవేళ సోలార్ ద్వారా గృహ యజమానులు, సంస్థలు ఉత్పత్తి చేసుకున్న విద్యుత్‌ను పూర్తిగా వారే వాడుకుని ఇంకా అదనంగా ప్రభుత్వ విద్యుత్‌ను వాడుకుంటే ఆ మొత్తానికి మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ప్రోత్సాహకం 30 నుంచి 50శాతం
 సోలార్ రూఫ్‌టాప్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవటానికి కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ నెడ్‌క్యాప్ సంస్థ రాయితీ అందజేస్తుందని జిల్లా మేనేజర్ బీ.జగదీశ్వరరెడ్డి తెలిపారు. ప్రధానంగా ఒకటి నుంచి మూడు కేవీ (కిలోవాట్) సామర్ధ్యం గల యూనిట్లకు 50 శాతం రాయి తీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

దీనిలో ప్ర దానంగా కేంద్రం ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం రాయితీ భరిస్తాయన్నారు. ఈ రాయితీ పోను ప్రతి కేవీ విద్యుత్ తయారీకి అవసరమైన సోలార్ ప్యానళ్లను, ఇతర పరికరాలను రూ. 63 వేలకే అందజేస్తారన్నారు. దీనిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా బిల్లింగులో ఆదాతో పాటు మూడేళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడి పూర్తి గా వినియోగదారులకు మిగిలిపోతుం దని తెలిపారు. అలాగే ప్రకృతిలో లభిం చే సాంప్రదాయ వనరులను ఆదా చేయటంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు