విజయవాడ సిటీ : అనుకోని సంఘటన జరిగితే సరిహద్దుల రాద్దాంతం చేసే పోలీసులు పుల్లా రమేష్ కస్టోడియల్ డెత్పై మాత్రం కిమ్మనకుండా కేసు కట్టడం చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో రమేష్ కొంగల మందు మింగినట్టు పలువురు చెబుతుండగా..అదుపులోకి తీసుకున్న ప్రాంత పరిధిలోని పటమట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు విచారణ కోసం రమేష్ను పోలీసు స్టేషన్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో కొంగల మందు మింగాడు. నోటి నుంచి నురగలు రావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. రమేష్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇతను మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
దీంతో పటమట పోలీసు స్టేషన్లో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసు అదుపులో చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని కస్టోడియల్ డెత్గా కేసును మార్చారు. ఎక్కడి వరకు వెళ్లిన తర్వాత కొంగల మందు తీసుకున్నాడనేది మాత్రం పోలీసులు చెప్పడం లేదు. పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలోనే రమేష్ కొంగల మందు తీసుకునే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం పోలీసుల కథనానికి భిన్నంగా ఉంది. స్టేషన్ సమీపంలోనే రమేష్ కొంగల మందు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎవరి వాదన వాస్తవం ఉందో తెలియాలంటే అజ్ఞాతంలో ఉన్న పోలీసు ఇన్ఫార్మర్, రమేష్తో పాటు మోపెడ్పై వచ్చిన వ్యక్తులు వెలుగులోకి రావాల్సి ఉంది.
లోప భూయిష్ట ఫిర్యాదు
రమేష్ కస్టోడియల్ డెత్కు సంబంధించి పెనమలూరు ఎస్ఐ వెంకట రమణ పటమట పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు సందేహాస్పదంగా ఉంది. కస్టడీకి తీసుకున్న సమయం, ప్రాంతం, కొంగల మందు మింగితే తీసుకెళ్లిన ఆస్పత్రి వివరాలేవీ పేర్కొనలేదని తెలిసింది.