రైస్‌మిల్లర్లపై పిడుగేసిన బాబు ప్రభుత్వం

1 Apr, 2019 14:14 IST|Sakshi

ధాన్యం సేకరణ అంతా ఒక్కరికే!

చంద్రబాబు సామాజికవర్గ వ్యక్తికే గంపగుత్తగా కట్టబెట్టే యత్నం

ఆందోళనలో జిల్లా రైస్‌మిల్లర్లు  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయాధార సిక్కోలు జిల్లాలో ఏకైక పెద్ద పరిశ్రమ రంగం ఏదైనా ఉందంటే... అవి రైస్‌మిల్లులే! ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఉపాధి కల్పిస్తున్నాయి! కానీ గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రైసుమిల్లుల యజమానులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది! ఈ కాలంలో 15 రైసుమిల్లులకు మూత కూడా వేసేశారు! ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు రైసుమిల్లుల ఉనికికే చంద్రబాబు ప్రభుత్వం ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. కస్టమ్‌ రైస్‌మిల్లింగ్‌ (సీఎంఆర్‌)పై కొత్త విధానంతో ఏకంగా వాటి ఆయువుపట్టుపైనే దెబ్బకొట్టింది. జిల్లాలో సీఎంఆర్‌ను కాంట్రాక్టు విధానంలో ఏకంగా ఒక వ్యక్తి లేదా ఒక కార్పొరేట్‌ సంస్థకు గంపగుత్తగా అప్పగించేందుకు చాపకింద నీరులా ఏర్పాట్లు చేసింది. ఈ గండం నుంచి తమను ఆదుకోవాలని రైసుమిల్లర్లు మంత్రి అచ్చెన్నకు మొరపెట్టుకున్నా చివరకు ఆయన కూడా ఆ కాంట్రాక్టు విధానానికే తెరవెనుక సహకారం అందించారనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలో వరి ప్రధాన పంట. దాదాపు 5.50 లక్షల మంది రైతులు ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 2.10 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇంచుమించి 9 లక్షల నుంచి పది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ఈ పంటలో 7 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ సీఎంఆర్‌ కింద రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని రైసుమిల్లులకు అందిస్తోంది. అలా వచ్చిన ధాన్యాన్ని రైసుమిల్లుల్లో మరపట్టి 67 శాతం బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి రైసుమిల్లర్లు అందజేస్తున్నారు. జిల్లాలో 328 రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇంచుమించు ఇవన్నీ సీఎంఆర్‌పై ఆధారపడే పనిచేస్తున్నాయి. ఇవన్నీ చిన్న మిల్లులే. ఒక్కో మిల్లు నిర్మాణానికి కనీసం రూ.2 కోట్లు వరకూ పెట్టుబడి అవసరం. జిల్లాలోని రైసుమిల్లర్లు తమ సొంత పెట్టుబడితో పాటు బ్యాంకు రుణాలపై ఆధారపడి ఈ వ్యాపారం చేస్తున్నారు.

సీఎంఆర్‌లో సర్కారు తప్పటడుగులు...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ఈ సీఎంఆర్‌ విధానంలో తప్పటడుగులు వేస్తూనే ఉంది. దీని ఫలితంగా రైసుమిల్లర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో మిల్లులను నడపాలంటే సీఎంఆర్‌ ఒక్కటే ఆధారంగా మిగిలింది. సెక్యూరిటీ డిపాజిట్‌ పెంచేయడం, సకాలంలో ధాన్యం సేకరణ చేయకపోవడం, గత నాలుగేళ్లుగా బకాయి ఉన్న సుమారు రూ.20 కోట్ల మొత్తాన్ని నేటికీ చెల్లించకపోవడం తదితర కారణాలు రైసుమిల్లర్లకు గుదిబండగా మారాయి. అంతేకాదు మిల్లింగ్‌ చార్జీలు కూడా సరిగా చెల్లించకుండా అధికార పార్టీ నాయకుల సన్మానాలకు, నజరానాలకే దారి మళ్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రైసుమిల్లర్లను దివాళాతీసేలా వ్యవహరించడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన 15 మిల్లులు మూతపడ్డాయి. ఇది చాలదన్నట్లుగా మిగతా మిల్లులపైనా ప్రభుత్వం గుదిబండను వేసింది.

రైసుమిల్లర్లకు తీవ్ర నష్టమే...
కొత్త విధానంలో సీఎంఆర్‌ అంతా ఒకే వ్యక్తి లేదా కార్పొరేట్‌ సంస్థ చేతికి అప్పగించడం వల్ల రైసుమిల్లర్లకు ధాన్యం వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో రైసుమిల్లులను మూసేయడం తప్ప యజమానులకు మరో మార్గం కనిపించట్లేదు. జిల్లాలో దాదాపు రైసుమిల్లర్లు అందరూ నష్టాల్లోనే ఉన్నారు. వారంతా ఏదో ఒక బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నవారే. కొత్త విధానమే అమలైతే తాము మరింత నష్టాల ఊబిలో కూరుకుపోతామని, మిల్లులను బ్యాంకులు జప్తు చేసే పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు సామాజికవర్గ వ్యక్తి కోసం...
ఇకపై సీఎంఆర్‌ కింద రైసుమిల్లర్లకు ధాన్యం ఇచ్చే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. శ్రీకాకుళం జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ ప్రక్రియ అంతా ఒకే వ్యక్తి లేదా ఒకే కార్పొరేట్‌ సంస్థకు కట్టబెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైల్‌ నంబరు ఎఫ్‌సీఎస్‌ 13034/11/2018–పీడీఎస్‌–ఏపీఎస్‌–సీఎస్‌సీఎల్‌ పేరుతో ఇందుకు సంబం« దించిన ఉత్తర్వులను సర్కారు గుట్టుచప్పుడు కాకుండా జారీ చేసింది. ఒకటీ రెండు రోజుల్లో సింగిల్‌ టెండరు విధానంలో చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన వ్యక్తికి అప్పగించేందుకు ఏర్పా ట్లు కూడా చేసేసినట్లు తెలుస్తోం ది. ఈ టెండరు ప్రక్రియ కూడా రహస్యంగానే నిర్వహించి మమ అనిపించేయనున్నారంటే దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని స్పష్టమవుతోంది.

కూలీల ఉపాధిపై ప్రభావం...
ఒక్కో రైసుమిల్లుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండొందల మంది వరకూ కూలీలు, కళాసీలు, డ్రైవర్లు, వాహనాల యజమానులు ఆధారపడి జీవిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో దాదాపు 70 వేల మందికి ఈ రైసుమిల్లింగ్‌ పరిశ్రమే జీవనోపాధి కల్పిస్తోంది. చంద్రబాబు సర్కారు దొంగదెబ్బతో రైసుమిల్లులు మూతపడితే వారి కుటుంబాలన్నీ రోడ్డున పడాల్సిందే.

చేతులెత్తేసిన అచ్చెన్న...
ఈ ఐదేళ్లలో జిల్లాలోని రైసుమిల్లర్లు మంత్రి అచ్చెన్న చెప్పినట్లుగానే నడుచుకున్నారు. ఆయనకు సంబంధించిన పలు కార్యక్రమాలకు నిధులనూ సమకూర్చుతూ వచ్చారు. అయినా వారికి ఏనాడూ ఎలాంటి సహాయం చేయకపోవడం గమనార్హం. కనీసం సర్కారు నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన రవాణా చార్జీలను కూడా ఇప్పించలేకపోయారు. తీరా ఇప్పుడు గంపగుత్తగా ఒకే వ్యక్తికి సీఎంఆర్‌ను కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు చేసిన కుయుక్తులను అడ్డుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో విశాలమైన రైసుమిల్లర్లు, రైతులు, కార్మికులు, కూలీలు, డ్రైవర్ల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా వ్యక్తిగతమైన, తమ అధినేతకు సంబంధించిన వ్యక్తులకు దోచిపెట్టేందుకే మొగ్గు చూపిం చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వేలాది మంది పొట్టగొట్టడం అన్యాయం...
టీడీపీ నాయకులు తమ స్వార్థం కోసం వేలాది మంది పొట్టగొట్టడానికైనా వెనుకాడరనడానికి సీఎంఆర్‌ విధానంలో రహస్య మార్పులే నిదర్శనం. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రయోజనాల కోసం జిల్లాకు ఆధారమైన రైసుమిల్లింగు పరిశ్రమనే దెబ్బతీస్తారా? ఇది చాలా అన్యాయం. అధికారులు స్పందించి తక్షణమే ఆ సింగిల్‌ టెండరు విధానాన్ని నిలిపేయాలని డిమాండు చేస్తున్నాం.
– దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నాయకుడు

మరిన్ని వార్తలు