నిధుల్లేక నీరసం!

28 Feb, 2016 01:10 IST|Sakshi

పంచాయతీలు, మండలాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండాలన్నా జిల్లా పరిషత్ నిధులే ఆధారం. అయితే కొన్నాళ్లుగా నిధుల్లేక జెడ్పీ అభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడుతుండడం, వివిధ విభాగాల ద్వారా అరకొరగా వచ్చే నిధులు కూడా నేరుగా పంచాయతీలకే వెళ్లిపోవడం వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయి.  
 
 విక్రయాల ద్వారా మరికొంత నిధులొచ్చేవి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరికొంత నిధులొచ్చేవి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏడాదికి రూ. 2.5 కోట్లు ఒక్క ఇసుక ద్వారా సెస్సు ద్వారా లభించేవి. ఒక్కోసారి ఆ నిధుల్ని జెడ్పీ సర్వసభ్య సమావేశాల ద్వారా తీర్మానాలు నిర్ణయించి జెడ్పీటీసీల పరిధిలో అభివృద్ధి కోసం  వెచ్చించేవారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా పరిషత్‌కు సంబంధించి ఇసుక కొత్త పాలసీ ప్రకటించారు. దీంతో కొన్నాళ్లపాటు సెస్సు కూడా వసూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ పాలసీలోని కొన్ని లోపాలు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి జిల్లా పరిషత్‌కు ఆదాయం కుంటుపడే అవకాశం కనిపిస్తోంది.
 
 - 13వ ఆర్థిక సంఘం ఇలా..
 జిల్లాలో రెండు మూడేళ్లపాటు మంచినీరు, తాగునీటి వ్యవస్థ నిర్వహణ కోసం 13వ ఆర్థిక సంఘం నిధుల కింద సుమారు రూ. 32.58 కోట్లు వచ్చేవి. వాటిలో నాలుగైదు గ్రామాలను ఓ యూనిట్‌గా సీపీడబ్ల్యూ స్కీమ్‌ల కింద ఉపయోగించారు. ఇలా ఏడాదికి రూ. 7.5 కోట్లు ఖర్చుతో 24 పథకాలు పూర్తి చేశారు. ఇప్పుడు వాటిలో కూడా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలను విడగొట్టి పంచాయతీల అభివృద్ధికి కృషిచేశారు. 13 ఆర్థిక సంఘం పూర్తయి 14వ ఆర్థిక సంఘం నిధులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ నిధులన్నీ నేరుగా పంచాయతీలకే జమ అవుతుండడంతో  జిల్లా పరిషత్ ఖాళీ అయిపోవాల్సి వచ్చింది.
 
 జెడ్పీకి ఎలాంటి అనుమతులూ లేకుండా పోయింది. గ్రామ పంచాయతీలన్నీ జిల్లా పంచాయతీ అధికారి పరిధిలోకి వెళ్లిపోయాయి. వస్తున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుందామన్నా జెడ్పీలో నిధుల్లేవు. అదేవిధంగా సెస్సుల ద్వారా వసూలయ్యే సాధారణ నిధులనే జిల్లా పరిషత్‌లోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఆ అవకాశం కూడా లేకపోయింది. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ ద్వారా నివేదించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు జెడ్పీ ద్వారా మంజూరయ్యేలా చూడాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడాలంటే చట్ట సవరణల అవసరాన్ని కూడా గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకోనున్నారని తెలిసింది.
 
   తడి చెత్త, పొడిచెత్త నిర్వహణ కూడా
 గతంలో పంచాయతీల పరిధిలోని పరిశుభ్రతను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు నిర్వహణ నిధులు లేక జిల్లా పరిషత్ చేతులెత్తేస్తోంది. జిల్లాలోని 38 మండలాల్లో అభివృద్ధి పథకాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే జెడ్పీ తీసుకోగా ఆయా విభాగాల అధికారులు ఇతర అంశాలపై దృష్టి సారించాల్సి వస్తోంది.
 
 తడి చెత్త, పొడిచెత్త సేకరణ, డంపింగ్, తడిచెత్త, పొడిచెత్తతో ఉత్పత్తుల తయారీపైన దృష్టి సారించిన అధికారులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)కు అప్పగించారని తెలిసింది. జిల్లా పరిషత్‌లో పరిపుష్టిగా నిధులుంటే అన్ని రకాల అభివృద్ధి జరిగేది. నిధులు లేకపోవడంతో వివిధ ప్రభుత్వ విభాగాలపైన ఆధారపడాల్సి వస్తోంది.
 

>
మరిన్ని వార్తలు