తీవ్ర తుపానుగా ‘ఎంఫన్‌’

17 May, 2020 04:13 IST|Sakshi
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్‌

బెంగాల్‌ వద్ద తీరం దాటే అవకాశం

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం.. ఆ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. మరింత బలపడనున్న ఈ తుఫాన్‌కు వాతావరణ శాఖ ‘ఎంఫన్‌’గా నామకరణం చేసింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 1,040 కి.మీ. దూరంలోనూ.. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,200 కి.మీ. దూరంలోను.. బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ దిశగా 1,300 కిమీ దూరంలోను కేంద్రీకృతమై ఉంది. మరింత వేగంగా బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా.. మే 18న ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మనపై అంతగా ప్రభావం లేనప్పటికీ..
► తుఫాన్‌ మనరాష్ట్రంపై అంత ప్రభావం చూపించకపోయినప్పటికీ తూర్పు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. 
► గంటకు 55 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్‌ బలపడుతున్న సమయంలో 80 కి.మీ. వేగంతో వీస్తాయి. మే 20 తరువాత ఈ తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, యానాంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతోపాటు, తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయి. 
► రాష్ట్రంలోని పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్‌ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. 

మరిన్ని వార్తలు