నీటి దందాతో కోట్లు

24 Mar, 2014 04:02 IST|Sakshi
నీటి దందాతో కోట్లు
  •      రూ.25 కోట్లకుపైగా దోచేస్తున్న ప్రైవేటు సంస్థలు
  •      ఐఎస్‌ఐ లేకనే వాటర్‌ప్యాకెట్లు, బాటిల్స్ అమ్మకాలు
  •      రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో నిలువు దోపిడీ
  •      తిరుపతి, చిత్తూరు నగరాల్లో నకిలీ కంపెనీలు
  •      పట్టించుకోని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు
  •  నకిలీ కంపెనీల నీళ్ల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారుు. వేసవి మొదలవడంతో ఈ నీళ్ల వ్యాపారం మాఫియూ స్థాయికి చేరుకుంది.
     
    సాక్షి, చిత్తూరు:  జిల్లా వ్యాప్తంగా ఏటా నకిలీ వాటర్ ప్యాకేజీ కంపెనీలు రూ.25 కోట్లకు పైగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచేస్తున్నాయి. నకిలీ వాటర్ కంపెనీలు కలుషితమైన నీటిని అమ్ముతూ దాదాపు కోట్లల్లో టర్నోవర్ చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆహార మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో 90 శాతం ప్యాకేజీ వాటర్ కంపెనీలు నడవడం లేదు. కొన్ని లెసైన్స్‌లే లేకుండా విచ్చలవిడిగా నాసిరకం, కలుషితమైన నీటితో వ్యాపారం చేస్తున్నాయి.
     
    వందల్లో నకిలీ కంపెనీలు
     
    తిరుపతిలో 4, చిత్తూరులో రెండు, మదనపల్లెలో 2 కలిపి జిల్లా మొత్తం పదిలోపే ఐఎస్‌ఐ ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ లెసైన్స్ కలిగిన కంపెనీలు ఉన్నాయి. ఒక్క తిరుపతిలోనే ఐఎస్‌ఐ ముద్ర లేని వాటర్‌ప్లాంట్‌లు పదికి పైగా ఉన్నాయి. ఇళ్లలో నడుస్తున్న చిన్నాచితక అనధికారిక కంపెనీలు రెండు వందలకు పైగా ఉన్నాయి. మదనపల్లెలో 50, చిత్తూరులో 100 వరకు ఇలాంటి బోగస్ వాటర్ ప్యాకేజీ కంపెనీలు ఉన్నాయి. శివారు ప్రాంతంలో స్థలం లీజ్‌కు తీసుకోవడం బోరు వేసేయడం, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనధికారికంగా ప్రారంభించేయడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. వీటిని అడ్డుకోవడంపై జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు.
     
     నిబంధనలు ఇవీ...
     బీఎస్‌ఐ ఇచ్చే ఐఎస్‌ఐ మార్కు తప్పనిసరిగా ఉండాలి. ఐఎస్‌ఐ ఉంటేనే ఫుడ్ లెసైన్స్ ఇస్తారు. ఈ రెండు ఉంటేనే ప్యాకేజీ వాటర్ కంపెనీ నిర్వహించడానికి అనుమతి లభిస్తుంది. పంచాయతీ లేదా మున్సిపాలిటీ అప్రూవల్ కచ్చితంగా ఉండాలి.
         
     స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీగా గుర్తింపు పొంది ఉండాలి. సేల్‌ట్యాక్స్ టిన్ మెంబర్‌తోపాటు టీవోటీ లెసైన్స్ కలిగి ఉండాలి.
         
     వాటర్‌ప్లాంట్‌లో ఒక మైక్రోబయోలజిస్టు, కెమిస్టు, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. వీరు ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పరీక్ష నిమిత్తం పంపుతుండాలి.
         
     ప్రతి నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి వాటర్ శాంపిల్స్ పరీక్షకు పంపి నివేదిక తెప్పించుకోవాలి. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్-లేబుల్‌పై ఐఎస్‌ఐ మార్కు, వాటర్ ప్యాకేజీ చేసిన తేదీ, గడువు తీరే తేదీ ముద్రించాలి.
         
     ఒక వాటర్ ప్యాకెట్‌ను మూడు రోజుల్లోనే విక్రయించాలి.  
     
     డబ్బు పెట్టినా... కలుషిత నీరే

     రైళ్లు, ఆర్‌టీసీ బస్టాండ్లలో, రైల్వేస్టేషన్‌లో, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి విష్ణునివాసం, శ్రీనివాసం వంటి యాత్రికుల సముదాయాల వద్ద నాసిరకం, కలుషిత ప్యాకేజీ వాటర్‌ను విరివిగా అమ్ముతున్నారు. ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ రూ.2, బస్టాండ్లలో రూ.3కి కూడా విక్రయిస్తున్నారు. ఐఎస్‌ఐ ముద్ర ఉన్న కంపెనీ బాటి ల్స్ లీటరు రూ.20 విక్రయిస్తుండగా, ఎలాంటి నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని కంపెనీల వాటర్ బాటిల్స్‌ను రూ.20 కే విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయూ మున్సిపల్ కమిషనర్లు, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
     
     అధికమొత్తాలకు ఆశపడి....

     నీటిని ఎలాంటి ప్రోసెసింగ్ చేయకుండా నేరుగా తయూరైన వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్‌పై అధిక మొత్తంలో మార్జిన్ ఇస్తున్నారు. దీంతో దుకాణదారులు కూడా నాసిరకం నీటి ఉత్పత్తులపైనే ఆసక్తి చూపుతున్నారు. రానున్నది వేసవి సీజన్ కావడంతో ఈ తరహా మోసపూరిత వ్యాపారాలు ఇప్పటి నుంచే పుంజుకోనున్నాయి.
     

>
మరిన్ని వార్తలు