నక్సలిజం కంటే డేంజర్

14 Nov, 2014 01:22 IST|Sakshi
నక్సలిజం కంటే డేంజర్

ల్యాండ్‌మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం..
రియల్ దందాలకు పాల్పడితే రౌడీషీట్లు
సహకరించే అధికారులపైనా నిఘా, చర్యలు
సైబరాబాద్ తరువాత అర్బన్ జిల్లాలో నేరాలు ఎక్కువ
నిరోధానికి పోలీస్ సిబ్బందిని భర్తీ చేయడమే మార్గం
విలేకరుల సమావేశంలో  అర్బన్ జిల్లా ఎస్పీ

 
గుంటూరు: ల్యాండ్ మాఫీయాపై ఉక్కుపాదం మోపుతామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఇది నక్సలిజం కంటే డేంజర్ అని పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ల్యాండ్ మాఫీయా ఎంతో మంది అమాయకుల జీవితాలతో  చెలగాటమాడుతోందన్నారు. ఇలాంటివారిని నక్సలైట్ల మాదిరిగా ఏరిపారేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు ...

► జిల్లాలో రాజధాని ఏర్పాటు ప్రకటనతో భూ వివాదాలు అధికమయ్యాయి. ధరలు పెరగడంతో పాత గొడవలన్నీ బయటకు వస్తున్నాయి. అర్బన్ జిల్లా పరిధిలో ఇప్పటికే ల్యాండ్‌మాఫీయాకు పాల్పడుతున్న 12 మందిపై రౌడీషీట్లు ఓపెన్‌చేశాం, నెలాఖరులోగా పూర్తిస్థాయిలో ఇలాంటి వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు చేపడతాం.

►ల్యాండ్‌మాఫియాకు సహకరిస్తున్న వ్యక్తులు, పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రారు శాఖలోని ఉద్యోగులపై కూడా నిఘా ఏర్పాటు చేస్తాం. తహశీల్దార్లు భూ వివాదాల్లో 145 సెక్షన్ అమలు చేసి బైండోవర్ చేసుకోవడం ద్వారా వీటిని కొంత మేర నివారించవచ్చు.

►ఇప్పటికే భూ వివాదాల్లో ఉన్న అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు, త్వరలో మరికొంత మందికి అదే గతి పట్టబోతోంది.

►ల్యాండ్‌మాఫీయాకు పాల్పడుతున్న వారి ఫొటోలను ఫ్లెక్సీలుగా వేసి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తాం.
 
సిబ్బందిని భర్తీ చేస్తాం...

► ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలతో పోలిస్తే  సైబరాబాద్ తరువాత గుంటూరు అర్బన్‌లోనే నేరాల సంఖ్య పెరిగిపోతుంది. నేర నిరోధానికి సిబ్బంది కొరత లేకుండా భర్తీ చేయాలి.

►త్వరలో సిబ్బంది విభజన చేపట్టి రూరల్ జిల్లా నుంచి రావాల్సిన 165 మంది సిబ్బందిని అర్బన్ జిల్లాకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నా..

►సిబ్బంది విభజన విషయంలో రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ కూడా సుముఖంగా ఉన్నారు. విభజన జరిగిన తరువాత ఎవరు ఏ కోర్టుకు వెళ్లినా చేసేది ఏమీ లేదు. సిబ్బంది భర్తీ మాత్రం పూర్తి చేసి తీరతాం. అర్బన్ జిల్లా పరిధిలో నేరాల సంఖ్య తగ్గించాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు.

►అర్బన్ జిల్లాలో పోలీసు స్టేషన్‌ల అప్‌గ్రేడ్, సిబ్బంది నియామకాలు, విజయవాడ, అర్బన్, గుంటూరు రూరల్ పరిధిలో కమిషనరేట్ ఏర్పాటు చేయాలా లేదా అనేది డీజీపీ నిర్ణయిస్తారు. మా చేతుల్లో ఏమీ ఉండదు.
 టోల్‌ప్లాజా వద్ద నిఘా పెంపునకు చర్యలు

►నేరాలు అధికంగా జరుగుతున్న మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో నేరస్తుల కదలికలు గమనించేందుకు విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న టోల్‌ప్లాజా వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం.

►టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి వాహనాలు, డ్రైవర్లు, వాహన నంబర్ల సహాఫొటోలు, వీడియోలు చిత్రీకరించేలా చర్యలు చేపడుతున్నాం.

► టోల్‌ప్లాజా, వారధి వద్ద అవుట్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం.

►బెట్టింగ్, లాటరీ, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా ఉంచి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నాం.
 ల్యాండ్ మాఫియా నక్సలిజం కంటే ప్రమాదం...అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతాం. నక్సలైట్లను ఏరివేసినట్టుగా పెరికేస్తాం...ఇప్పటికే 12 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ల్యాండ్ మాఫీయాలోని వ్యక్తుల ఫొటోలను ఫ్లెక్సీలుగా వేయించి భూ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తాం.
       
- రాజేష్‌కుమార్,
 అర్బన్ జిల్లా ఎస్పీ, గుంటూరు
 
 

>
మరిన్ని వార్తలు