గట్టు చెరెవరకూ గండమే

15 Jul, 2018 06:53 IST|Sakshi

జిల్లాలో 70 గ్రామాలకు పడవ ప్రయాణమే ఆధారం

రహదారులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లేక.. అవస్థలు

పరిమితికి మించిన ప్రయాణీకులతో రాకపోకలు 

ప్యాసింజర్లను ఎక్కించకూడదన్న నిబంధనలు బేఖాతరు

పట్టించుకోని అధికారులు 

కళ్లు తెరవని పాలకులు

ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఈ ఫొటోలోని పడవను చూశారా? పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులతో నడిచింది. ఇదెక్కడో కాదు తాజాగా మంటూరు–వాడపల్లి మధ్య లాంచీ ప్రమాదానికి గురైన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో నడిచిన పడవిది. రక్షణ కోసం ఉండాల్సిన లైఫ్‌ జాకెట్లు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు జల సమాధి కావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఉభయ గోదావరి జిల్లాల అధికారుల కళ్లముందే పరిమితికి మించి ప్రయాణికులతో నడిచింది. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రమాద ఘటనకు చేరుకునేందుకు ఈ పడవలపైనే ప్రయాణాలు సాగాయి. 

జనాల రద్దీ దృష్ట్యా అక్కడున్న లాంచీలు తిప్పాల్సిందిపోయి ప్రమాదకరమైన ప్రయాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు అధికారులు చోద్యం చూశారు. లాంచీలు తిరగకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో పడవలపైనే స్థానికులు రావల్సి వచ్చింది. ఒక్కొక్క పడవపై 25 మందికి మించి ప్రయాణించిన దృశ్యాలు కన్పించాయి. ఏముందిలే ఈ ఒక్కరోజే కదా అన్నట్టుగా లాంచీ ప్రమాద ఘటనా స్థలి వద్ద అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కానీ, ఇక్కడ రోజూ జరుగుతున్న తంతు కూడా దాదాపు ఇదే. లాంచీ ప్రయాణాలతో పాటు పడవ ప్రయాణాలు సమాంతరంగా సాగుతున్నాయి. లాంచీలే ప్రమాదాలకు గురైతే, పడవల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మచ్చుకు ఇక్కడ జరిగిన పరిణామాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ జిల్లాలో చాలా చోట్ల జరిగేది ఇదే. 

రహదారుల్లేక, ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించక జిల్లాలో 70 వరకు గ్రామాల ప్రజలు పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. నిర్వాహకులు తమకెంత సొమ్ము వస్తోందని చూసుకుంటున్నారే తప్ప పరిమితిని పట్టించుకోవడం లేదు. అసలు ప్రయాణికుల రాకపోకలకు పడవలను అనుమతించకూడదు. లాంచీలు, పంటుల పైనే ప్రయాణాలు సాగించాలి. ఇప్పుడా లాంచీలు, పంటులే ప్రమాదాలకు గురై ప్రయాణికుల్ని బలితీసుకుంటున్నాయి. అలాంటి పడవ ప్రయాణాలను ఇంకెంత తీవ్రంగా తీసుకోవాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, జిల్లాలో ఆ దిశగా పర్యవేక్షణ చేయడం లేదు. ప్యాసింజర్లను ఎక్కించకూడదన్న నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్నారు. పడవ ప్రయాణాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగాక అయ్యో పాపం అంటూ హడావుడి చేయడం తప్ప నిబంధనలు, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. 

జిల్లాలో పడవ ప్రయాణాలు సాగిస్తున్న గ్రామాలివే
► ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. 1992లో గోగుల్లంక, భైరవలంక మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు. 

► ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవ ప్రయాణమే సాగిస్తారు. 1990లో లంక రేవులో పడవ మునిగిపోయి 10మంది చనిపోయారు. 

► తాళ్లరేవు మండల పరిధిలో గోవలంక, పిల్లంక, అరిటికాయ లంక, శేరిలంక, కొత్తలంక ప్రజలు పడవ ప్రయాణం చేయకతప్పడం లేదు. ఈ ప్రాంతంలోని గోదావరి నదీపాయపై 2004లో జరిగిన పడవ ప్రమాదాల్లో  తొమ్మిది మంది వరకు మృతి చెందారు. 

► మామిడికుదురు మండలంలో కరవాక–ఓడలరేవు, గోగన్నమఠం–బెండమూర్లంక, పెదపట్నం లంక–కె.ముంజవరం గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. 

► రాజోలు, సఖినేటిపల్లి  మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.

► పి.గన్నవరం మండలంలోని కనకయ్యలంక–దొడ్డిపట్ల, ఎల్‌.గన్నవరం– కోడేరులంక గ్రామాల ప్రజలకూ పడవలే గతి. 

► కొత్తపేట మండలంలోని తొగరిపాయకు వెళ్లేందుకు వరదలొచ్చినప్పుడు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు.ఆలమూరు మండలంలో వరదలొచ్చినప్పుడు చెముడులంక నుంచి బడుగువాని లంక గ్రామాలకు పడవపైనే వెళ్లాల్సి ఉంటుంది.  

► కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం–కేదారిలంక గ్రామానికి పడవపైనే ప్రయాణాలు సాగిస్తుంటారు. 

► కాట్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ పరిధిలోని రామాలయంపేట, జీ. మూలపొలం మధ్య, తల్లంకుర్రు–కేశనకుర్రుపాలెం మధ్య, కుండలేశ్వరం– కేశనకుర్రుపాలెం మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. 

► సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకు వెళ్లేందుకు పడవపైన ప్రయాణం సాగిస్తున్నారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీపై ప్రయాణికులు వెళ్తుంటారు. 

► వీఆర్‌పురం మండలంలోని తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు, కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకు పడవపై వెళ్తుంటారు. 

► తాజాగా లాంచీ ప్రమాదం జరిగిన దేవీపట్నం మండలంలోనైతే 17 గ్రామాలకు పడవలు, లాంచీలే ఆధారం. 

సర్కార్‌ చిన్నచూపు – గ్రామాలకు ప్రయాణ ముప్పు
రహదారి సౌకర్యం లేని గ్రామాలన్నింటికీ నాటు పడవలే ఆధారం. వాటి మీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవనయానం సాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ప్రమాదకర పరిస్థితులను నియంత్రించే దిశగా అధికారులు, పాలకులు అడుగు వేయడం లేదు. వాస్తవానికైతే పైన చెప్పిన 70 గ్రామాల్లో చాలా వరకు రహదారులు వేస్తే పడవలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులు వేసినట్టయితే పడవలపై వెళ్లి రావాల్సిన అవసరం ఉండదు.

కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు రహదారుల్లేక పోవడం వల్ల అధికారులు, సిబ్బంది సైతం అక్కడికి వెళ్లడం లేదు. ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లేవు. అంతెందుకు తాజాగా లాంచీ ఘటనలో మృతి చెందినవారు ఉన్న కొండమొదలు, కచ్చులూరు, కె.గొందూరు, తాటివాడ గ్రామాల్నే తీసుకుంటే.. అక్కడ కనీస సౌకర్యాల్లేవు.

గ్రామాలకు రహదారులు లేవు సరే.. కనీసం ఫోన్‌ సౌకర్యం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం మరమ్మతులకు గురైనా ఇంతవరకు పట్టించుకోలేదు. కచ్చులూరు గ్రామంలోనైతే పది రోజులుగా విద్యుత్‌ సరఫరా లేదు. ఇటీవల కురిసిన గాలివానకు పడిపోయిన విద్యుత్‌ స్తంభాలను రోజులు గడుస్తున్నా పునరుద్ధరించలేదు. ఇక, వైద్యం పరిస్థితీ అంతే. వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారంతా పడవలు, లాంచీల మీద ప్రయాణాలు సాగించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. 

ఆయా గ్రామాల్లో టెలిఫోన్, విద్యుత్‌ సౌకర్యాల సంగతి పక్కన పెడితే ప్రయాణమే ప్రమాదకరంగా ఉన్న గ్రామాలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాకపోకలకు వీలుగా రహదారులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో.. ఇంకెన్ని ప్రమాద ఘటనలు జరగాలని చూస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు