సర్వే టెస్ట్‌కు మంగళం.. సెలవు రోజు ఇంటర్వ్యూ

26 Sep, 2015 01:44 IST|Sakshi

 ఏలూరు (టూ టౌన్) :సర్వేయర్ లెసైన్స్‌లు జారీ చేసేందుకు జిల్లా సర్వే, భూమి రికార్డుల విభాగం అధికారులు భారీగా సొమ్ములు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అభ్యర్థులకు సర్వే అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించకపోవడంతోపాటు సెలవు రోజున ఇంట ర్వ్యూలు నిర్వహించడం ఇందుకు ఊతమిస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన 22 మంది హైదరాబాద్‌లోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో 6 వారాల పాటు శిక్షణ పొందారు. వీరికి సర్వే, భూ రికార్డుల విభాగం డెప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ ఆధ్వర్యంలో అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లెసైన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. అలా లెసైన్స్ పొందిన వారు ప్రైవేటు సర్వేయర్లుగా భూముల్ని సర్వే చేయడానికి అర్హత పొందుతారు.
 
  అయితే, శిక్షణ పొందిన 22 మంది అభ్యర్థులను శుక్రవారం ఏలూరులోని సర్వే, భూమి రికార్డుల కార్యాలయానికి పిలిపించారు. వారికి అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించకుండా.. కేవలం ఇంటర్వ్యూలతో సరిపెట్టారు. అదికూడా 40 నిమిషాల్లో పూర్తిచేశారు. సర్వేయర్ లెసైన్స్ కావాలంటే కొంత సొమ్ము ముట్టజెప్పాలని అభ్యర్థులపై అధికారులు ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులైన సదరు అభ్యర్థులంతా సర్వేయర్ లెసైన్స్ వస్తే తమకు పని దొరుకుతుందన్న ఉద్దేశంతో సొమ్ములిచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా, గురువారం నాడు అసెస్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉం డగా, ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన కమిటీ వెంట వెళ్లాల్సి వచ్చిందన్నారు. అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సెలవు రోజైనా విధులకు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించామని చెప్పారు. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదన్నారు.
 
 ఆలస్యం అవుతుందనే..
 సర్వే ట్రైనింగ్ పూర్తయిన
 అభ్యర్థులకు ఎప్పుటికప్పుడు లెసైన్సులు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. గురువా రం ఇంటర్వ్యూలు నిర్వహించాలను కున్నాం. వీలు కాలేదు. అందుకే సెలవు రోజున ఇంటర్వ్యూలు చేశాం.
 - పీవీ సత్యనారాయణ,
 అసిస్టెంట్ డెరైక్టర్, సర్వే విభాగం
 
 వసూళ్లకు పాల్పడితే చర్యలు
 సర్వే లెసైన్సుల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెలవు రోజైనా ఇంటర్వ్యూ నిర్వహించాం. అభ్యర్థులంతా సర్వే అకాడమీలో శిక్షణ పొందిన దృష్ట్యా అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించలేదు.
 -  సీహెచ్‌వీ సుబ్బారావు,
 డెప్యూటీ డెరైక్టర్, సర్వే విభాగం
 

మరిన్ని వార్తలు