డీసీసీబీపై ముప్పేట దాడి!

30 Jan, 2014 01:39 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై హైదరాబాద్ నుంచి వచ్చిన ఆప్కాబ్, నాబార్డు అధికారులు విచారణ జరిపారు. వీరితో పాటు సమాంతరంగా విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేసినట్టు తెలిసింది. వారికి అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆ నివేదికను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.  
 
 బీసీసీబీపై ఆప్కాబ్, నాబార్డుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో దాని ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదా లో పనిచేస్తున్న ఇద్దరు ఆప్కాబ్ అధికారులు, నాబార్డు నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఇక్కడికొచ్చి విచారణ చేశారు. దీంతో పలు అడ్డగోలు వ్యవహారాలు వెలుగు చూశాయి.  ముఖ్యంగా డీసీసీబీ సీఈఓపైనే విచారణలో ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఆయనపైనే ఆరోపణలు ఉన్నట్టు భోగట్టా. ఈ మేరకు నివేదిక తయారు చేసి, బాధ్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేసినట్టు సమాచా రం.  విచారణ, అందులో తేలిన విషయాలు బయటికి పొక్కనివ్వకుండా డీసీసీబీ అధికారు లు జాగ్రత్త పడ్డారు. ఏ ఒక్కరూ నోరు మెదపకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.   
 
 నివేదిక తొక్కిపెట్టేందుకు యత్నాలు
 విచారణ నివేదికను తొక్కి పెట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ఒక మంత్రి జోక్యం చేసుకుని, రాజధాని స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఇదే విషయమై ఓ ఆప్కాబ్ అధికారిని ‘సాక్షి’ వివరణ కోరగా విచారణ జరగడం వాస్తవమేనన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు విచారణ చేసి, నివేదిక సంబంధిత ఉన్నతాధికారులకు ఇప్పటికే అందజేశారని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు