అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

5 Sep, 2019 04:58 IST|Sakshi
అజయ్‌కుమార్‌(ఫైల్‌)

సాక్షి, అమరావతి/ సింధనూరు టౌన్‌: అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు పోస్టల్‌కాలనీకి చెందిన చెన్నారెడ్డి కేదార్‌నాథ్‌.. కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ కోసం 21 రోజుల కిందట అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌కు వెళ్లాడు. ఇటీవల ఓ సరస్సులో ఈతకోసం దిగి బయటకు రాలేక ప్రాణాలు విడిచాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకొచ్చింది. నేడో, రేపో కేదార్‌నాథ్‌ మృతదేహం నెల్లూరుకు రానున్నట్టు సమాచారం.

అలాగే కర్ణాటకలో కొప్పళ జిల్లా సింధూనూరు తాలూకాలోని శ్రీపురం జంక్షన్‌కు చెందిన కొయ్యలముడి శ్రీనివాస్‌ చాలా ఏళ్ల కిందటే ఏపీ నుంచి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఆయన కుమారుడు అజయ్‌కుమార్‌(24) అమెరికాలోని ఆర్లింగ్‌టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ (ఇంజినీరింగ్‌) చదువుతున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టర్నర్‌ఫాల్స్‌ను చూసేందుకు వెళ్లిన సమయంలో ఓ స్నేహితుడు నీటిలోకి జారిపడ్డాడు. అతన్ని రక్షించేందుకు అజయ్‌కుమార్‌ విఫలయత్నం చేసి.. అతనితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసింది.

మరిన్ని వార్తలు