డెబిట్, క్రెడిట్‌ పాత కార్డులకు చెల్లు

31 Oct, 2018 14:03 IST|Sakshi
ఈఎంవీ ఏటీఎం కార్డు

డిసెంబరు 31 తరువాత పని చేయవు

మాగ్నటిక్‌ స్ట్రిప్‌కార్డు స్థానంలో చిప్‌

మార్పు తప్పనిసరంటున్న ఆర్బీఐ

ఇప్పటికే ఎస్‌బీఐ కొత్త కార్డుల పంపిణీ

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు: బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్‌ కార్డుల్లో చిప్‌ ఉందో లేదో పరిశీలించండి. లేందటే మీ బ్యాంక్‌ హోం బ్రాంచ్‌ను సంప్రదించాలి. ప్రస్తుతం మీ వద్ద ఉన్న మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ కార్డు స్థానంలో చిప్‌ ఆధారిత కార్డులను బ్యాంకులు ఉచితంగా అందిస్తున్నాయి. లేదంటే డిసెంబరు 31 తర్వాత పాతకార్డులు పని చేయవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ఆర్బీఐ ఆదేశాలతో...
కొన్నేళ్లుగా కార్డు క్లోనింగ్, ఆన్‌లైన బ్యాంకింగ్‌ మోసాలు భారీగా పెరిగాయి. వీటిని అరికట్టేందుకు మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ టెక్నాలజీ బదులు ఎలాక్ట్రానిక్‌ చిప్‌ ఆధారిత కార్డులను జారీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. పాత కార్డులతో పోలిస్తే ఈఎంవీ (యూరోవే,  మాస్టర్‌కార్డు, వీసా) చిప్‌ కార్డుల్లో భద్రత అధికం. దేశీయ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ సంస్థల డెబిట్‌/క్రెడిట్‌ కార్డులకు సైతం ఆర్బీఐ ఆదేశాలు వర్తిస్తాయి. పాతకార్డులు మార్చుకోవాలంటూ ఇప్పటికే ఖాతాదారులకు ఆయా బ్యాంకులు సంక్షిప్త సందేశాలు పంపుతున్నాయి. వీటిని చాలామంది గమనించడం లేదని బ్యాకులు చెబుతున్నాయి.

2016 నుంచి జారీ
2016 నుంచి మరింత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కార్డులను బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ కార్డుల్లో ఒక వైపు మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ నల్లరంగులో మరోవైపు ఈవీఎం చిప్‌ ఉంటుంది. ఇందులో సెక్యూరిటీ పీచర్స్‌ ఎక్కువగా ఉన్నాయి. మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ ఏటీఎం కార్డులు ఎటీఎంల్లో నగదు తీసుకోవడానికి, పాయింట్‌ ఆప్‌ స్కేల్‌ (పీఓఎస్‌)లో స్వైపింగ్‌ చేయడానికి పనికి వస్తాయి. ఇందుల్లో నకిలీ కార్డుల తయారీ (క్లోనింగ్‌ కార్డు) తయారీ, డేటా కొల్లగొట్టేందుకు అవకాశం ఉందని నిషేధించారు. దీంతో 2016 నుంచి బ్యాంకు కార్డుల్లో మాగ్నెటిక్‌ స్ట్రిప్‌తో పాటు ఈఎంవీ చిప్‌ కూడా అమరుస్తున్నారు. మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ ఏటీఎంల్లో పని చేస్తుంది. ఏటీఎంలు బ్యాంకుల ఆధీనంలో, లైసెన్స్‌ కంపెనీల ఆధీనంలో ఉంటాయి. పాయిం ట్‌ ఆప్‌ స్కేల్‌ (పీఓఎస్‌) మిషన్లలో పని చేయదు. చిప్‌ ఉన్న కార్డులు మాత్రమే పని చేస్తాయి. చిప్‌ ఉన్న కార్డుల నుంచి సమాచారం కొల్లగొట్టడం, క్లోనింగ్‌కార్డులు తయారీ చేయడం వీలుకాదు.

మాగ్నెటిక్‌ కార్డు వెనుకభాగంలో ఉన్న నలుపురంగు స్ట్రిప్‌లో సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. కొత్త టెక్నాలజీ కార్డుల్లో ముందు భాగంలో ఉంటే చిప్‌లో డైనమిక్‌ పార్మాట్‌లో నిక్షిప్తం చేసి ఉంటారు. దీన్ని క్లోనింగ్‌ చేయడం చాలా కష్టం.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ విషయంలో కొత్తకార్డు వినియోగదారులూ జాగ్రత్త వహించాలి. కార్డు పిన్‌ నెంబరు, సీవీవీ లాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. మీ కార్డు నంబరు, పిన్, సీవీవీ ఉపయోగించి ఆన్‌లైన్‌ ద్వారా ఎవరైనా లావాదేవీలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఖాతాదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి కొత్తకార్డు పొందవచ్చు. చాలా బ్యాంకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ 2016 ముందు ఏటీఎం కార్డులు తీసుకున్న ఖాతాదారులందరికీ పోస్టు ద్వారా ఉచితంగా కొత్తకార్డులు పంపిస్తోంది.

మరిన్ని వార్తలు