కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు

30 Nov, 2013 02:49 IST|Sakshi

సాక్షి, హన్మకొండ :  కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి వేదికలుగా ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిధుల లేమి కారణంగా కాకతీయ ఉత్సవాలు అరకొరగా సాగుతున్నాయి.

ఉత్సవాల నిర్వాహణకు కోటి రూపాయలు విడుదల చేస్తామని గతేడాది ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ. 60 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులన్నీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి. డిసెంబర్‌లో జరిగే ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిధుల కేటాయించాల్సిందిగా ఇటీవలే జిల్లా కలెక్టర్ కిషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది.
 

మరిన్ని వార్తలు