ఆర్థిక ఇబ్బందులు తాళలేక డిగ్రీ విద్యార్థిని మృతి

27 Aug, 2017 03:04 IST|Sakshi

పాశర్లపూడి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య

రాజోలు : ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తలెత్తున్న గొడవలతో మనస్తాపానికి గురై కడలి గ్రామానికి చెందిన అప్పారి భవాని (19) పాశర్లపూడి వైనతేయ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భవాని మామిడికుదురు దీప్తి కళాశాలలో బీఏ చదువుతోంది. శనివారం ఉదయం కళాశాలకు వెళ్లిన భవాని పాశర్లపూడి వెళ్లి బోడసకుర్రు వంతెన మీద నుంచి గోదావరిలో దూకింది.

 దీంతో స్థానికులు భవాని కళాశాల గుర్తింపు కార్డు ద్వారా కళాశాలకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. భవాని మృతదేహాన్ని వెలికి తీసి రాజోలు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు. భవాని తండ్రి సత్యనారాయణ, తల్లి మహలక్ష్మి ఆర్థిక ఇబ్బందుల వల్ల తరచూ గొడవ పడుతుండేవారని, దీంతో భవాని మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై వివరించారు.

>
మరిన్ని వార్తలు