టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం

27 Aug, 2014 02:59 IST|Sakshi
టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం

ఏలూరు అర్బన్ : ‘జిల్లాలో టీడీపీకి  ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం.. పార్టీ బలోపేతానికి శ్రేణులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం స్థానిక ఖండ్రికగూడెం పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఏలూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్ధించబోమని, ప్రజల ఆకాంక్షలకు తగినవిధంగా ప్రజాపోరాటాలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.
 
 ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ ప్రభంజనంతో యువత పార్టీలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తోందని అన్నారు. మోడీ ఆలోచనలకు అనుగుణంగా యువతను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యకర్తలు రానున్న 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటినుంచే కృషి చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.
 
 పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, జిల్లా శాఖ అధ్యక్షురాలు లక్కోజు సుజాత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాని దుర్గారావు, కార్యదర్శి కురెళ్ల సుధాకరకృష్ణ, నాయకులు కత్తి రాము, పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కైరం అప్పారావు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు