2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు

4 Jul, 2020 05:18 IST|Sakshi

‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద విధి విధానాలను వెల్లడించిన గ్రామీణాభివృద్ధి శాఖ

ఒక్కరికే అంత భూమి లేకపోతే పక్క భూమి వారితో గ్రూపుగా ఏర్పడొచ్చు

గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్‌ వెల్స్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు గ్రామీణాభివృద్ది శాఖ ప్రకటించింది. నవరత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించి  శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 

► బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలి. 
► భూగర్భ జల మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు. 

అర్హతలు, విధివిధానాలు..
► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. 
► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. 
► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు. 

మరిన్ని వార్తలు