ఆ 3 జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు..

29 Apr, 2020 19:50 IST|Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించకపోతే చర్యలు : ఆళ్ల నాని

సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్లనాని తెలిపారు. ఆస్పత్రుల సంఖ్యను పెంచి, మెరుగైన సదుపాయాలు కల్పించామని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. టెలీమెడిసిన్‌ అమలవుతున్న తీరుపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారని, లాక్‌డౌన్‌ సమయంలో టెలీమెడిసిన్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారని చెప్పారు. కుటుంబ సమగ్ర సర్వేలో గుర్తించిన ప్రతి ఒక్కరికీ.. వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ( లాక్‌డౌన్‌ : గ్రీన్‌జోన్స్‌లో తెరుచుకోనున్న షాపులు )

అవసరం మేరకు వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాళ్లందరినీ వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కచ్చితంగా ఓపీ సేవలు అందించాలని గతంలోనే ఆదేశించామన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు