'సీఎం జగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారు'

1 Dec, 2019 18:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పరిచయ వేదిక ఆత్మీయ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఆవినాష్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్భుతమైన పనితీరు కనబరిచిన డివిజన్ వాలంటీర్లను సత్కరించారు.  

అనంతరం అవినాష్ మాట్లాడుతూ.. డివిజన్ల పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ కొనియాడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలాడేలా విజయ ఢంకా మోగిస్తామని తెలిపారు. రాష్ట్రానికి మరో 30ఏళ్లు సీఎంగా వైఎస్‌ జగనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలోని డివిజన్లలో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు, పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భవకుమార్ తెలిపారు. పార్టీలో చేరిన అవినాష్ నాయకత్వాన్ని కార్యకర్తలందరూ బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు