మంత్రి ఉమ కనుసన్నలలోనే ఇసుక మాఫియా

19 Sep, 2018 10:22 IST|Sakshi

ఇసుక ధరలను పెంచేశామని మాపై దుష్ప్రచారం తగదు

విజయవాడ అర్బన్‌ శాండ్‌ లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌  

భవానీపురం (విజయవాడ పశ్చిమ): మంత్రి దేవినేని ఉమా అండదండలతోనే అండదండలతోనే ఇసుక మాఫియా హల్‌చల్‌ చేస్తోందని ది విజయవాడ అర్బన్‌ శాండ్‌ లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అల్లు నాగరాజు, మోతుకూరి రామకృష్ణ అన్నారు.  భవానీపురంలోని అసోసియేషన్‌ ఆఫీస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  ఇసుక రీచ్‌లన్నీ ఆయన నియోజకవర్గంలో ఉన్నందున ఇసుక అక్రమ రవాణా ఆయన కనుసన్నలలోనే జరుగుతోందని, టిప్పర్‌ యజమానులు ఇసుక ధరను పెంచేశారని దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

ఈ నెల 15వ తేదీన నారెడ్‌కో విజయవాడ చాప్టర్‌ అధ్యక్షుడు వి.సుబ్బారావు తాము ఇసుక ధరలను అమాంతం పెంచేశామని చెప్పటాన్ని వారు ఖండించారు. నిన్న మొన్నటి వరకు టిప్పర్‌ ఇసుక రూ.2 వేలకే అందించామని గుర్తు చేశారు. గొల్లపూడి పరిధిలోని సూరాయిపాలెం ఇసుక రీచ్‌ను ఆధిపత్య పోరుతో వారం రోజులుగా మూసేశారని, దీంతో ఇసుక సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పారు. 

ఇక గుంటుçపల్లి రీచ్‌లో ప్రయార్టీ బళ్లు పేరుతో వారి టిప్పర్లకే ప్రాధాన్యతనిస్తున్నారని, తమలాంటి లారీ యజమానులు ఆ రీచ్‌లో ఉదయం బండి పెడితే సాయంత్రానికి ఒక లోడు వస్తుందని, అదికూడా గ్యారెంటీ లేదని వివరించారు. పెర్రి రీచ్‌లోకూడా ఇదే పరిస్ధితి నెలకొందని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు దూరా న్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు అమ్ముతున్నామని, అందులో రీచ్‌లో చెల్లించాల్సిన రూ.800లు, డ్రైవర్‌ బేటా, డీజిల్‌  ఖర్చులు పోను రూ.500లు మిగలటం కష్టంగా ఉందన్నారు. సుబ్బారావు చెప్పినట్లు ఎవరైనా రూ.6వేలకు అమ్మితే ఆయన ఫిర్యాదు చేయవచ్చని, అమ్ముతున్న వ్యక్తి పేరు, లారీ నెంబర్‌ తమకు తెలియపరిస్తే తామే పోలీసులకు అప్పగిస్తామన్నారు. 

తలపట్టుకున్నాం...
 సూరాయిపాలెం రీచ్‌లో జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఆయనే ఏమీచేయలేక తలపట్టుకున్నట్ల తెలుస్తుందన్నారు. సూరాయపాలెం, గుంటుపల్లి ఇసుక రీచ్‌లలో జరుగుతున్న దందాపై ఫిర్యాదు చేసేందుకు 1100, 104 నెంబర్లకు ఫోన్‌చేస్తే ఎత్తి ఆ పేర్లు వినగానే పెట్టేస్తున్నారని తెలిపారు. గతంలో భవానీపురంలో ఇసుక రీచ్‌ ఉన్నప్పుడు లారీ ఇసుక రూ.15 నుంచి రూ.18వేలకే అమ్మామని గుర్తు చేశారు. 

ఇప్పటికీ భవానీపురంలో రీచ్‌ను తెరిచే అవకాశం ఉన్నా గొల్లపూడిలోని మంత్రి ఉమా అనుయాయులు ఒప్పుకోకపోవడంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. ఏడాది క్రితం అప్పటి సబ్‌ కలెక్టర్‌ తమకు రోజుకు నాలుగు ట్రిప్పులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కావడం లేదని చెప్పారు. ఇసుక ఎక్కువ ధరలకు అమ్మి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, రీచ్‌ల నుంచి స్రక్రమంగా అందితే తక్కువ ధరకే విక్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, కె.లక్ష్మీనారాయణ, ఎమ్‌.చినవెంగయ్య తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు