రేపటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం

10 Jun, 2020 22:26 IST|Sakshi

సాక్షి, తిరుమల: ట్రయల్‌ రన్‌ దర్శనంలో భాగంగా బుధవారం శ్రీవారిని 7200 మంది స్థానికులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 20 85 లక్షలు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. ఇక రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేయనున్నట్లు పేర్కొంది. భక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటే క్వారంటైన్‌కు పంపుతామని టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పూర్తైందని, ఆన్‌లైన్‌లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదే విధంగా ఉదయం 6:30 నుంచి గంటపాటు వీఐపీలు శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ పేర్కొంది. లాక్‌డౌన్‌ నింబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి ఆలయాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు