తిరుమలలో షార్ట్‌సర్క్యూట్‌.. క్యూలోని భక్తులకు గాయాలు!

12 Oct, 2017 01:06 IST|Sakshi

సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ ప్రవేశద్వారం దగ్గరున్న స్కానింగ్‌ సెంటర్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో భక్తులకు షాక్‌ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకొని పలువురు భక్తులకు గాయాలైనట్టు తెలుస్తోంది.  ఈ ఘటనతో శ్రీవారి దర్శనానికి కొంత అంతరాయం ఏర్పడింది.

ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న లగేజీ స్కానింగ్‌ సెంటర్‌ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద, శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ భక్తులను తనిఖీ చేసిన అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మహాద్వారం ఉన్న స్కానింగ్‌ సెంటర్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా భక్తులకు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల షాక్‌ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు క్యూలైన్‌లో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి క్యూలైన్‌లోనే ప్రాథమిక చికిత్స అందించినట్టు తెలుస్తోంది. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆ క్యూలైన్‌లోని వారిని అనుమతించారు.

మరిన్ని వార్తలు