పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ అజ్ఞాని 

3 Nov, 2019 11:38 IST|Sakshi
టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలు తెలుసుకుంటున్న మంత్రి కృష్ణదాసు, పక్కన పేరాడ తిలక్, దువ్వాడ వాణి

ఇసుక విధానంపై కనీస అవగాహన లేదు 

ధ్వజమెత్తిన మంత్రి కృష్ణదాస్‌

సాక్షి, టెక్కలి: ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవన్‌ను రాజకీయ అజ్ఞానిగా భావించవచ్చునని, ఆయన చేయబోయే లాంగ్‌మార్చ్‌ ప్రజలను వంచించడానికేనన్నారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని, టెక్కలి, నరసన్నపేట తదితర కేంద్రాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేందుకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌.రాజు, పార్టీ నాయకులు అన్నెపు రామారావు, దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, ఆర్‌.శైలేంద్రకుమార్, బోయిన నాగేశ్వరరావు, దుక్క రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

కేజీబీవీ ఆకస్మిక తనిఖీ 
అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పాఠశాల వసతి సమస్యలు, ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు