జగనన్నకు అండగా..

25 Sep, 2018 06:52 IST|Sakshi
ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు, ఆలయాల్లో పూజలను పార్టీ శ్రేణులు సోమవారం నిర్వహించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు పాల్గొని కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను దోపిడీ చేయడంతోపాటు చట్టాలను ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని మించిన ఘనుడు మరొకరు లేరన్నారు. శాసన సభలో అధికారపక్షం పాత్ర ఎంత ఉంటుందో.. అంతేస్థాయిలో ప్రతిపక్షాల పాత్ర ఉంటుందన్నారు.

ప్రతిపక్షానికి అన్నిరకాల ఆర్థిక వ్యవహారాలు చేసే అధికారం ఉందన్నారు. సంక్షేమ పథకాలు, ఆర్థిక వ్యవహారాల్లో అవినీతిని, అరాచకాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా చంద్రబాబు తన స్థాయిని మరిచిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నపుడు మైక్‌ కట్‌ చేయడం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన వారిని బెదిరిచండం వంటివి చేయడం సరికాదన్నారు. అధికారం కోసం మహిళలకు, యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక అబద్ధపు హామీలిచ్చి.. అధికారం చేపట్టాక వారందరినీ నిలువునా మోసం చేసిన మహానుభావుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరాచకాలను అడ్డుకట్ట వేసేందుకు, టీడీపీ చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరంగా తెలియజేసేందుకు పాదయాత్రె? శరణ్యమని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారన్నారు. పాదయాత్రలో భాగంగా జగన్‌ ఎక్కడికి వెళ్లినా ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు ఎన్నో కుయుక్తులు చేస్తున్నారన్నారు. టీడీపీ మీద ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉందని.. ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. ఎప్పుడు తగిన గుణపాఠం చెబుదామాని ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికలకు అనుకూలంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ  చైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి,  నాయకులు సాధు వైకుంఠరావు, పొన్నాడ రుషి, అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, మండవిల్లి రవి, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, కోరాడ రమేష్, జీవరత్నం, కెఎల్‌ ప్రసాద్, కోణార్క్‌ శ్రీను, రఫీ, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దనరావు, గొండు రఘురాం, గొండు కృష్ణ, సిజారుద్దిన్, ఉమామహేశ్వరి,  టి.కామేశ్వరి, చల్లా అలివేలుమంగ, నల్లబారికి శ్రీను, జి.అప్పలాచారి పాల్గొన్నారు. తొలుత పార్టీ శ్రేణులు ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

 వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర చరిత్రలో నిలిచి పోతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కష్ణదాస్‌ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు దాటి సందర్భంగా నరసన్నపేటలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పైడితల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేక్‌ కట్‌ చేశారు.

రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు  జగన్మోహనరావు, టంకాల అచ్చెన్నాయుడు, ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, రాజాం టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల పార్టీ కన్వీనర్లు, యూత్‌ కన్వీనర్లు   పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండల పరిధిలో  సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో జగన్‌కు సంఘీభావంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బల్లిపుట్టుగ  నుంచి మండల కేంద్రం కవిటి వరకు ర్యాలీ సాగింది.

కాశీబుగ్గ లోని పార్టీ పలాస సమన్వయకర్త సీదరి అప్పలరాజు కేక్‌ కట్‌ చేశారు.  కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

పాలకొండలో పార్టీ శ్రేణులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కోటదుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ పాల్గొన్నారు.   

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో  సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు జరిగాయి. 

మరిన్ని వార్తలు