హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సజావుగా ఉందని డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన డయల్ 100 విజయవంతంగా నడుస్తోందన్నారు. డయల్ 100 ప్రజలకు చాలా ఉపయోగంగా ఉందన్నారు.
రోజూ 70 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయని అందులో 3 వేల కాల్స్ పోలీసు శాఖకు చెందినవి ఉంటున్నాయని డీజీపీ తెలిపారు. డయల్ 100 పనితీరుకు ఎంఓపీ కింద 60 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని దినేష్రెడ్డి చెప్పారు. దీంతో డయల్ 100 మరింత బలోపేతమవుతుందన్నారు. డయల్ 100తో నిందితులను త్వరగా పట్టుకుంటున్నట్లు తెలిపారు.
ఇకపై ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇస్తామని దినేష్ రెడ్డి తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలి విడతగా 90 పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిసెప్షన్ సెంటర్లలో పోలీస్ స్టేషన్ వాతావరణం ఉండదని ఆయన అన్నారు.