అయ్యో పాపం.. కుక్కలు, పందులకు బలైన చిన్నారి..!!

19 Jan, 2019 07:32 IST|Sakshi

తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందు

చీల్చి హతమార్చిన పందులు, కుక్కలు

నెల్లిమర్ల యాతవీధిలో ఘటన

విజయనగరం, నెల్లిమర్ల : ఏ తల్లి కన్నబిడ్డో... నడిరోడ్డుపై కుక్కలు, పందులకు ఆహారంగా మారిపోయింది. ఆడపిల్లని భారంగా భావించారో... పరువు పేరుతో నిర్దాక్షిణ్యంగా విసిరేశారో... నెల్లిమర్ల యాతవీధిలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉంది. ఓ వైపు దట్టంగా కురుస్తున్న మంచు... మరోవైపు చలిగాలులకు కన్ను కూడా తెరవని ఆ చిన్నారి ఏడుపు సమీప కుటుంబాల చెవిన శుక్రవారం వేకువఝామున పడింది. తలుపుతెరుచుకుని వచ్చి చూస్తే ఆ శిశువును చీల్చేస్తున్న పందులు కనిపించాయి.

వెంటనే ఆ పందులను తరిమి చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రాణాలు వదిలిన ఆ చిన్నారిని వారే శ్మశానంలో పూడ్చిపెట్టారు. నెల్లిమర్ల పట్టణంలోని శ్రీనివాసా థియేటర్‌ ఎదురుగా యాతవీధిలో ఖాళీగా నున్న ప్రదేశంలో ఆ పసికందును ఎవరో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు విసిరేసినట్టు తాను చూశానని ఓ బాలుడు చెబుతున్నాడు. కనీసం బొడ్డు కూడా కోయకుండా తీవ్రమైన చలిలో పడేశారు. అక్కడే సంచరిస్తున్న పందులు, కుక్కలు చిన్నారిని చీల్చుకు తిన్నాయి. సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు.

మరిన్ని వార్తలు