డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు ప్రారంభించిన సీఎం జగన్‌

9 Aug, 2019 10:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సును ప్రారంభించారు. విజయవాడ నగరంలోని హోటల్‌ తాజ్‌ గేట్‌వేలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ఆరంభించారు.  పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఉపన్యాసం చేస్తున్నారు. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్‌ సెక్టార్‌ వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. మధ్యాహ‍్నం భోజన విరామం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పలువురు రాయబారులు, కాన్సులేట్‌ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహిస్తారు.

కాగా ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు లక్ష్యం.

మరిన్ని వార్తలు