సినిమా హిట్‌కు హీరోహీరోయిన్లే అక్కర్లేదు..

10 May, 2015 13:49 IST|Sakshi
సినిమా హిట్‌కు హీరోహీరోయిన్లే అక్కర్లేదు..

ప్రముఖ దర్శకుడు సాగర్
 
రాజమండ్రి :  సినిమా సూపర్‌హిట్‌కు ప్రముఖ హీరో హీరోయిన్లే అవసరం లేదని కథ, కథనం బాగుండి, దాన్ని డీల్ చేసే సత్తా గల దర్శకుడుంటే  నూతన నటులైనా హిట్ అవుతుందని ప్రముఖ దర్శకుడు సాగర్ అన్నారు. 40 ఏళ్ల క్రితం తాను అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసిన ‘నీడలేని ఆడది’ అందుకు నిదర్శనమని, అదే సమయంలో కృష్ణ నిర్మించిన ‘కురుక్షేత్రం’తో పోలిస్తే ఆ సినిమా అప్పట్లో సూపర్‌హిట్టన్నారు. శనివారం ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వర్ధమాన హాస్యనటుడు కర్రి రామారెడ్డితో కలిసి మందపల్లి ఉమా మందేశ్వరస్వామి వారిని దర్శించుకుని, పూజలు,అభిషేకాలు నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా సాగర్ విలేకరులతో మాట్లాడుతూ ఒకప్పుడు  5 శాతం పెట్టుబడితో సినిమా నిర్మాణానికి ముందుకు వస్తే 95 శాతం బయటనుంచి సమకూరేదని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. రూ.కోటిన్నరతో కొత్త నటీనటులతో సినిమా తీయవచ్చని, అదే పాత, కొత్తవాళ్ళతో తీయాలంటే రూ. 5 నుంచి 6 కోట్లవుతుందని అన్నారు.
 
 కథలో బలం, చిత్ర నిర్మాణంలో దర్శకుడికి స్వేచ్ఛ ఉన్నప్పుడే దర్శకుడి అంచనాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా సినిమా తయారై బాగా ఆడుతుందన్నారు. గతంలో దర్శకునికి 90 శాతం స్వేచ్ఛ ఉండగా నేడు 10 శాతమే ఉందని, దానితో అనుకున్నట్టు తీయలేకపోతున్నారని అన్నారు.
 
 ఒకప్పుడు సంవత్సరానికి 40 సినిమాలు రిలీజైతే నేడు 400 వరకూ రిలీజవుతున్నాయని, ఏ సినిమా ఎప్పడొచ్చి, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని అన్నారు. 1983లో నరేష్-విజయశాంతిల ‘రాకాసిలోయ’కు తొలుత దర్శకత్వం వహించిన తాను ఇంతవరకూ 30 సినిమాలు రూపొందించానన్నారు. కృష్ణ, సౌందర్యలతో ‘అమ్మదొంగా’, భానుచందర్, లిజీలతో ‘స్టూవర్ట్‌పురం దొంగలు, వాణిశ్రీ, సౌందర్య, వినోద్‌కుమార్‌లతో ‘అమ్మనా కోడలా’ తన ఆణిముత్యాలన్నారు.‘ఆశలపల్లకి’అనే సందేశాత్మక చిత్రానికి నంది అవార్డు వచ్చిందన్నారు. ఈ ఏడాది రెండు సినిమాలకు ప్లాన్ చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు