నిరసనల భయం

15 Dec, 2014 00:50 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటనకు నిరసనల భయం వెంటాడుతోంది. దీంతో అటు జిల్లా అధికారులు ... ఇటు టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ సమావేశంలోనే రైతులకు రుణవిముక్తి కార్డులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రుణమాఫీ పొందిన రైతులకు అందించనున్నారు. రైతులతోపాటు పింఛన్‌దారులు, ఇసుక రీచ్‌లపై డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం జిల్లా అభివృద్ధికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రైతుల రుణమాఫీతోపాటు ఇటీవల జరిగిన జన్మభూమి -మా ఊరు కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ విలేజ్ తదితర అంశాలపై చర్చిస్తారు.

అయితే జిల్లాలో మూడోవంతు రైతులకు మాత్రమే రుణమాఫీ అందింది. దీంతో రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ సభకు పూర్తిగా తెలుగుదేశం సానుభూతిపరులైన రైతులను మాత్రమే తీసుకురావాలని మండల నేతలకు, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో పంట రుణాలు  మూడు వేల కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయి. ఇప్పుడు మాఫీ అయింది కేవలం రూ. 376 కోట్లు మాత్రమే. జిల్లాలో మొత్తం ఏడు లక్షల ఆరు వేల మంది ఉండగా, అందులో మొదటి దశలో మూడు లక్షల 31 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తింప చేశారు. వీరికి రూ. 1420 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా అందులో కేవలం రూ.376 కోట్లు మాఫీ అయ్యాయి.

రెండో దశలో మూడు లక్షల 77 వేల మంది ఉండగా అందులో కేవలం 51 వేల మందికి మాత్రమే అన్ని వివరాలు అప్‌లోడ్ అయ్యాయి. ఇంకా రెండు లక్షల 32 వేల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయన్న ఉద్దేశ్యంతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.  అర్ధరాత్రి తర్వాత వారిని అదుపులోకి తీసుకునే అవకావం ఉంది.  మరోవైపు సీఎం సభకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలల బస్సులను రవాణాశాఖ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు