జిల్లా కలెక్టర్‌గా బాబు

8 Jan, 2015 01:25 IST|Sakshi
జిల్లా కలెక్టర్‌గా బాబు

నగరపాలక సంస్థ కమిషనర్‌గా వీరపాండ్యన్
 
కర్నూలు జేసీగా హరికిరణ్ నియామకం    
జేసీగా శేషగిరిబాబు
ప్రస్తుత జేసీ మురళి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ

 
విజయవాడ/విజయవాడ సెంట్రల్ : జిల్లా నూతన కలెక్టర్‌గా అహ్మద్ బాబు నియమితులయ్యారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జేసీ జె.మురళితోపాటు నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 37 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులోభాగంగా జిల్లాకు నూతన కలెక్టర్‌ను నియమించడంతోపాటు జాయింట్ కలెక్టర్, ప్రస్తుతం ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న జె.మురళిని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్, గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ఆయన స్థానంలో ఎంవీ శేషగిరిబాబును నియమించింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలోని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, బిల్ అలర్ట్ తదితర అంశాల్లో తనదైన శైలిలో వ్యవహరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌ను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జి.వీరపాండ్యన్ నియమితులయ్యారు. వీరపాండ్యన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెర్ఫ్‌లో అదనపు సీఈవోగా పనిచేస్తున్నారు.

ముక్కుసూటిగా వ్యవహరించే వీరపాండ్యన్

నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమితులైన జి.వీరపాండ్యన్ గతంలో ఖమ్మం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, గూడూరు, నెల్లూరు సబ్‌కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వ ర్తించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే బ్యాచ్ కావడంతో ప్రస్తుత కమిషనర్ హరికిరణ్‌తో మంచి స్నేహసంబంధాలు ఉన్నట్లు సమాచారం. నగరంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సదస్సులో వీరపాండ్యన్ పాల్గొన్నారు. అప్పుడే బదిలీ ఉత్తర్వులు విడుదల కావ డంతో వీరపాండ్యన్ విజయవాడ వస్తున్నారంటూ ఐఏఎస్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చనడిచింది.

మరిన్ని వార్తలు