పొన్నాలకు తీరక..!

17 Aug, 2013 04:33 IST|Sakshi

 సాక్షి, కరీంనగర్ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తీరిక దొరకడం లేదు. అత్యంత కీలకమైన జిల్లా సమీక్ష మండలి సమావేశానికి పదినెలల తరువాత సమయం ఇచ్చినా.. చివరి నిమిషంలో మళ్లీ చేతులెత్తేశారు. శనివారం జరగాల్సిన  డీఆర్సీ సమావేశం వాయిదా వేయించారు. తద్వారా గత ఇన్‌చార్జి మంత్రుల జాబితాలో పొన్నాల కూడా చేరిపోయారు. ఈయనకు ముందు జూపల్లి కృష్ణారావు, ముఖేష్‌గౌడ్ ఈ బాధ్యత నిర్వర్తించారు. వారి హయాంలో డీఆర్సీ సమావేశాల ఊసే కనిపించలేదు. లక్ష్మయ్య బాధ్యత తీసుకున్న వెంటనే అక్టోబర్ 30న సమావేశం నిర్వహించారు.
 
 జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో యంత్రాంగానికి సూచనలు ఇవ్వడంతోపాటు అధికారులకు సరైన దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించిన డీఆర్సీ ఇన్‌చార్జి మంత్రుల నిరాసక్తతతో నీరుగారిపోతోందని విపక్షసభ్యులు మండిపడ్డారు. ఆ సమయంలో ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని చెప్పిన పొన్నాల.. రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపికగా సమావేశంలో పాల్గొన్నారు. దీంతో క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతాయని అందరూ భావించారు. ఆ తర్వాత పదినెలలైనా ఆయన జిల్లా వైపు తొంగిచూడకపోవడంతో పాత ఇన్‌చార్జులకు ఈయన భిన్నం కాద ని తేలిపోయింది. సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగిందనుకుంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా సమావేశం వాయిదా వేయడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం నెలల తరబడి నిర్వహించకపోవడంతో ప్రగతిపై ప్రభావం చూపుతోంది.
 
 నీరుగారిన ప్రజాప్రతినిధుల ఆశలు
 జిల్లా  సమస్యలపైకి ప్రభుత్వ దృష్టిని మళ్లించాలని వివిధ పార్టీల శాసనసభ్యులు భావించారు. ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన హామీలు పొంద డం ద్వారా ప్రజలు, రైతులకు భరోసా కల్పించాలని ఆశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. పంటనష్టం భారీగా ఉంది. మంథని డివిజన్‌లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. గురువారం కూడా భారీ వర్షం నష్టాన్ని మరింత పెంచింది. మధ్య మానేరు ముంపు భాధితుల సమస్య చాలాకాలంగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. అవసరాల మేరకు యూరియా అందుబాటులో లేక రైతులు జిల్లావ్యాప్తంగా ఆందోళన బాట పడుతున్నారు. అధికారులు కొరతను తీరుస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చడం లేదు. విద్యుత్ కొరత తీవ్రం గా వేధిస్తోంది. లోవోల్టేజీ, అప్రకటిత కోతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో అమలులో అనేక లోటుపాట్లు బయటపడుతున్నాయి. బంగారుతల్లి పథకంపై లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. చాలాచోట్ల సీజనల్ వ్యాధులతో పల్లెలు మంచం పట్టాయి. వీటన్నింటిపై చర్చిం చి ప్రజలకు అండగా నిలిచేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించాలని విపక్షా లు ఆశించాయి. తీరా సమయానికి సమావేశం వాయిదా పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల నుంచి దాడి తప్పదని భావిం చే వాయిదా వేయించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 డీఆర్సీ వాయిదా : సీపీవో
 శనివారం జరగాల్సిన డీఆర్సీ సమావేశం అని వార్య కారణాలతో వాయిదా పడిందని ముఖ్య ప్రణాళిక అధికారి పి.సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు