అర్హులందరికీ ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’

18 Jun, 2020 04:54 IST|Sakshi

లబ్ధిదారులను ఖరారు చేసిన జిల్లా స్థాయి కమిటీలు  

ఇప్పటికే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఈనెల 20న ఆర్థిక సాయం అందజేత

సాక్షి, అమరావతి: అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది. సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశాయని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లు వివరించింది. ఈ ఆదేశాల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 

► గత సంవత్సరం అర్హులైన నేతన్న నేస్తం లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందుకోని వారు కొందరున్నారని, వారికి ఈ సంవత్సరం అందజేయాలని చేనేత జౌళి శాఖ డైరెక్టర్‌ చేసిన సూచనను ప్రభుత్వం స్వాగతించింది. 
► పవర్‌లూమ్స్‌ రావడం వల్ల చాలా మంది చేనేతలు ఆర్థికంగా ముందుకు సాగలేక పోయారు. కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయ పడింది. 
► ఆరు నెలల క్రితం గత సంవత్సరానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. వేల మంది చేనేత కార్మికులకు ఈ ఆర్థిక సాయం వరంగా మారింది. అప్పుల బారి నుంచి చాలా మంది బయట పడ్డారు. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద పని చేయడం మానేశారు. 
► గతంలో పెట్టుబడి సాయం లేక మాస్టర్‌ వీవర్లను చేనేత కార్మికులు ఆశ్రయించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. నేరుగా ప్రభుత్వం సాయం అందించడంతో జీవనోపాధిని మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఏర్పడింది. 
► అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల17న అందించాల్సిన ఆర్థిక సాయం ఈ నెల 20న అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ జరిగి నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జిల్లా కమిటీలదే తుది నిర్ణయం.

మరిన్ని వార్తలు