జగన్‌కు అండగా నిలిచిన జిల్లా ప్రజలు

20 May, 2014 04:38 IST|Sakshi
జగన్‌కు అండగా నిలిచిన జిల్లా ప్రజలు

 వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్
గూడూరు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి దివంగత మహానేతపై ఉన్న ప్రేమను చాటుకున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ అన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను రెండో పట్టణంలోని పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి స్వగృహంలో ఆదివారం ఆయన అభినందించారు. అనంతరం మేరిగ మాట్లాడుతూ జిల్లా ప్రజలు వైఎస్సార్‌సీపీపై ఎనలేని అభిమానాలను ఓట్ల రూపంలో చూపించారన్నారు.

 తిరుపతి, నెల్లూరు పార్లమెంటు స్థానాలతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నాలుగు మున్సిపాల్టీలు, 31 జెడ్పీటీసీలు, 30 ఎంపీపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందన్నారు. స్థానిక సంస్థలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా నిలిచిందన్నారు. పార్టీ గెలుపునకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


ఉదయగిరి నియోజకవర్గంలో కొంతమంది పార్టీ నాయకులు నిర్లిప్తతతో వ్యవహరించడంతో ఓడిపోవడం జరిగిందని అలాగే కోవూరు, వెంకటగిరిలో డబ్బు ప్రభావం చూపిందన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించినప్పటికి పార్టీ శ్రేణులు హుందాతనంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానుల పై దాడులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులంతా వారికి అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు.

 వైఎస్సార్‌సీపీకి ఓట్లేసి విజయాన్ని అందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  వైస్సార్‌సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ  జిల్లాలోని అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మంచి విజయం సాధించిందన్నారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 1.9 శాతం ఓట్లు మాత్రమే వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీకి ఎక్కువ వచ్చాయన్నారు.

 ఎన్నికల్లో గెలిచిన వెంటనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రైతుల రుణమాఫీ పై మాట మారుస్తూ మార్టిగేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటామంటూ చెప్పడం నమ్మకద్రోహమేనన్నారు. ఈ సమావేశంలో గూడూరు పట్టణ, రూరల్ కన్వీనర్లు నాశిన నాగులు, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, చిల్లకూరు మండల నాయకులు బుర్లా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎద్దల మధుసూదన్‌రెడ్డి, ఓజిలి బాలకృష్ణారెడ్డి, గూడూరు మం డల నాయకులు నెలబల్లి భాస్కర్‌రెడ్డి, పిట్లు నాగరాజు, బొమ్మిరెడ్డి మధురెడ్డి, గూడూరు రాజేశ్వరరెడ్డి, పొట్ల మోహన్‌రావు, చేవూరు నాగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు