వారంలో పెళ్లి.. అంతలోనే అఘాయిత్యం

8 Jun, 2017 09:18 IST|Sakshi
వారంలో పెళ్లి.. అంతలోనే అఘాయిత్యం

తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం దివీస్‌ ల్యాబరేటరీ ఉద్యోగి సీహెచ్‌ వేణు(27) బుధవారం సాయంత్రం చెరకుపల్లి అవంతి కళాశాల సమీపంలో తుప్పుల్లో విగతజీవిగా కనిపించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇక్కడకు చేరుకున్న భీమిలి పోలీసులకు మృతదేహం పక్కన శీతల పానీయం, పురుగుమందు బాటిళ్లు కనిపించాయి. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో మంగళవారమే మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా ఐపూర్‌ మండలం కొచ్చెర్లగా అతని జేబులో దొరికిన ఈఎస్‌ఐ గుర్తింపు కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడటాన్ని బట్టి చూస్తే ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు