నా కూతురి ప్రాణం కాపాడండి

22 Feb, 2019 07:23 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మజ్జి దివ్య

జీబీ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్న దివ్య

సహాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకోలు

విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): జీబీ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె దివ్య ప్రాణం కాపాడాలని ఆమె తల్లిదండ్రులు మజ్జి శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మిలు వేడుకుంటున్నారు. అల్లిపురంలోని అమ్మవారివీధికి చెందిన మజ్జి దివ్య గతేడాది డిసెంబర్‌ 31న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నడుము నుంచి కింద భాగం మొత్తం అచేతనంగా మారి కాలు కదల్లేని పరిస్థితిలో నగరంలో ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గత నెల 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందించి తోచిన ఆర్థిక సాయం చేశారు. దాతల సాయంతో ఆమెకు చికిత్స అందజేసినా.. ఇంకా దివ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.

ఆమె కోలుకోవాలంటే మరో రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్టు దివ్య తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత తమకు లేదని, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటి వరకు తమకు చేయూతనిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహాయం చేయాలనుకునే దాతలు ఎస్‌.సురేష్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రెడ్నెమ్‌ గార్డెన్స్‌ బ్రాంచ్, ఎస్‌బీ ఖాతా నంబర్‌ 20033585049, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నంబర్‌ ఎస్‌బీఐఎన్‌0000952 ద్వారా గాని, పేటీఎం, గూగుల్‌ పే, పోన్‌ పే నుంచి 78424 73149 నంబర్‌ ద్వారా సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు