ఆక్సిజన్‌ 90 % కంటే తక్కువ ఉంటే ఆలోచించాలి 

15 Jul, 2020 04:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా బాధితుల్లో చాలామంది ఆక్సిజన్‌ విషయమై ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ సోకుతుందేమోనన్న ఆందోళన ఉన్న వారూ ఆక్సిజన్‌ గురించే భయపడుతున్నారు. కరోనా సోకిన వాళ్లందరికీ ఆక్సిజన్‌ అవసరం లేదని.. కేవలం 5 శాతం మందికి మాత్రమే అవసరం అవుతోందని.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.  

► ఆరోగ్యంగా ఉన్న వారి రక్తంలో 95 శాతం వరకూ ఆక్సిజన్‌ నిల్వలు ఉంటాయి. 
► కొంచెం అటూ ఇటుగా ఉన్నా 90 శాతం వరకూ ఎలాంటి ఇబ్బందీ 
ఉండదు. 90 శాతం కంటే తగ్గితే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి 
► 85 శాతం కంటే తగ్గితే కచ్చితంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టు లెక్క. అలాంటి వారు వెంటనే వైద్య సాయం పొందడం మంచిది. 
► సాధారణంగా ఆరోగ్యవంతుల్లో 90 శాతం కంటే ఆక్సిజన్‌ తగ్గదు. 
► దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.. 60 ఏళ్లు దాటిన వారు అప్పుడప్పుడూ ఆక్సిజన్‌ నిల్వలు చూసుకుంటూ ఉండాలి. 
► దీని కోసం తాజాగా డిజిటల్‌ పల్సాక్సీ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. 
► నడక, ప్రాణాయామం వంటివి ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పెంచుతాయి.

చూసుకుంటూ ఉండాలి 
రక్తంలో 90 శాతం కంటే ఆక్సిజన్‌ తగ్గితేనే వైద్యం అవసరం. అంతకంటే ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తుల్లో సమస్య లేదని అర్థం. గతంలో థర్మామీటర్, గ్లూకోమీటర్‌ తరహాలోనే ఇప్పుడు పల్స్‌ఆక్సీ మీటర్‌ను ఇంట్లో ఉంచుకుని అప్పుడప్పుడూ చెక్‌ చేసుకోవడం మంచిది. దీని ద్వారా ప్రమాదాన్ని ఊహించి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. 
– డాక్టర్‌ సాయికిషోర్, అనస్థీషియా నిపుణులు, మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి 

మరిన్ని వార్తలు