సబ్జెక్టు నిపుణులతో భోధన
సప్తగిరి చానల్లో ప్రసారం
పాఠశాల విద్య ఆర్జేడీ వెంకట క్రిష్ణారెడ్డి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం దూరదర్శన్ చానల్ ద్వారా సబ్జెక్టు నిపుణులతో వీడియో పాఠశాలను ప్రసారం చేయనున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ మర్తాల వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 1,2 తరగతుల విద్యార్థులకు, 12 గంటల నుంచి 1 గంట వరకు 3,4,5వ తరగతుల విద్యార్థులకు క్లాసులు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 6,7 తరగతుల విద్యార్థులకు.. సాయంత్రం 3 నుంచి 4 రకు 8,9 తరగతుల విద్యార్థులకు క్లాసులు ఉంటాయన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు లాంగ్వేజెస్, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నాన్లాంగ్వేజ్ సబ్జెక్టు వీడియో పాఠాలను ప్రసారం చేస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31వ తేదీ వరకు తరగతుల వారిగా షెడ్యూల్ ప్రకారం పాఠాల బోధన ప్రసారం అవుతుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పరిధిలోని విద్యార్థులకు సంబంధిత సమాచారాన్ని తెలియచేయాలన్నారు. అలాగే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆర్జేడీ వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.